టీమిండియా టీ20 వరల్డ్ ఛాంపియన్గా అవతరించినప్పటి నుంచి ఈ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తోంది. వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతోంది. అయితే జట్టు సక్సెస్ అవుతున్నా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ఫామ్ మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గతేడాది కాలంగా సూర్య బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో రన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో తన పేలవ ఫామ్పై సూర్యకుమార్ యాదవ్ తొలిసారి మనసు విప్పి మాట్లాడారు.
ఇది నాకు 'లెర్నింగ్ ఫేజ్'-సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026 కోసం జట్టు ఎంపిక పూర్తయింది. ఫామ్లో లేకపోయినా, సెలెక్టర్లు సూర్య నాయకత్వంపైనే నమ్మకం ఉంచారు. ఇటీవల జీఎల్ఎస్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సూర్య.. తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "క్రీడలు మనకు చాలా నేర్పుతాయి. ప్రతి ఆటగాడి కెరీర్లో తాము ఇంకా నేర్చుకోవాల్సిన దశలో ఉన్నామని అనిపించే సమయం ఒకటి వస్తుంది. ప్రస్తుతం నేను కూడా అలాంటి 'లెర్నింగ్ ఫేజ్' లోనే ఉన్నాను. అయితే నా జట్టులోని 14 మంది సహచర ఆటగాళ్లు నా బాధ్యతను పంచుకుంటున్నారు. నేను మళ్లీ మునపటిలా ఆక్రమణకు దిగితే ఏమవుతుందో వారికి తెలుసు." అని సూర్య పేర్కొన్నారు.

పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే చదువు ఆపేస్తామా?
తన ఫామ్ను విద్యార్థుల చదువుతో పోలుస్తూ సూర్య ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. "పరీక్షల్లో మనకు తక్కువ మార్కులు వస్తే చదువు మానేయం కదా? ఎక్కువ మార్కులు సాధించేందుకు మరింత కష్టపడతాం. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, కఠినంగా శ్రమిస్తున్నాను. త్వరలోనే పరుగుల వేట మొదలవుతుందనే నమ్మకం నాకు ఉంది." అని సూర్య ధీమా వ్యక్తం చేశారు.
కివీస్ సిరీస్పైనే అందరి కళ్లు
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ జనవరి 21, 2026న ప్రారంభం కానుండగా.. జనవరి 31, 2026న ముగియనుంది. మరోవైపు వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7, 2026న జరగనుంది. వరల్డ్ కప్ సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావాలంటే ఈ న్యూజిలాండ్ సిరీస్ అతనికి కీలకం కానుంది. ప్రస్తుతం జట్టులోని మిగిలిన బ్యాటర్లందరూ మంచి టచ్లో ఉండగా.. కెప్టెన్ కూడా పరుగుల వరద పారిస్తే భారత్కు తిరుగుండదు.