Suryakumar Yadav: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయం విజయం సాధించిన అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ మాటలు నేరుగా ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని.. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీని ఉద్ధేశించినట్లుగా స్పష్టమవుతున్నాయి. ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ట్రోఫీని తాకడం ఓ గొప్ప అనుభూతి
గాబాలో వర్షం కారణంగా చివరి టీ20 మ్యాచ్ రద్దు కావడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను గెలిచిన విజేతగా నిలిచింది. సిరీస్ ట్రోఫీని అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. బ్రిస్బేన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తన సంతోషాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. "చివరికి ఒక ట్రోఫీని చేతితో తాకే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరీస్ విజయం ట్రోఫీ నాకు అందించినప్పుడు, దాన్ని నా చేతుల్లో పట్టుకుని ఆ అనుభూతిని పొందాను." అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు ఆసియా కప్ ఫైనల్ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలను సూచిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దాదాపు 2 నెలలు గడిచినా ఆ ట్రోఫీ ఇంకా భారత జట్టుకు అధికారికంగా అందలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ ట్రోఫీని అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. తమకు దక్కాల్సిన ట్రోఫీని పట్టుకోలేకపోవడంపై తన నిరసనను పరోక్షంగా వ్యక్తం చేశారు. ఇది పీసీబీ చీఫ్పై భారత జట్టులోని అసంతృప్తిని సూచిస్తుంది.
మహిళా జట్టు గెలుపును ప్రస్తావించిన కెప్టెన్
సూర్యకుమార్ యాదవ్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ కొద్ది రోజుల క్రితం భారత మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని గుర్తు చేశారు."కొద్ది రోజుల క్రితం మరొక ట్రోఫీ ఇండియాకు వచ్చింది. మహిళా జట్టు ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆ ట్రోఫీ కూడా ఇంటికి వచ్చింది. ఇది చాలా గొప్ప అనుభూతినిస్తుంది, ఈ ట్రోఫీని తాకడం కూడా అద్భుతంగా ఉంది" అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మహిళా జట్టు ప్రపంచకప్ విజయాన్ని ప్రస్తావించడం ద్వారా, 'ట్రోఫీలు భారత్కు రావాలి, వాటిని స్వీకరించడంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు' అనే బలమైన సందేశాన్ని సూర్యకుమార్ పంపారు.
వివాదానికి మూలం
ఈ ట్రోఫీ వివాదం సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత తలెత్తింది. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి భారత్ వ్యతిరేక వైఖరి ఉందనే కారణంతో భారత జట్టు ట్రోఫీని అతడి చేతుల మీదుగా అందుకోవడానికి నిరాకరించింది. క్రికెట్ దౌత్యంలో ఇది ఒక అరుదైన, సంచలనాత్మక సంఘటన.
అయితే ట్రోఫీ వివాదాన్ని త్వరగా ముగించడానికి క్రికెట్ బోర్డులు రంగంలోకి దిగాయి. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా దుబాయ్లో జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వితో ఈ విషయంపై చర్చించారు. ఐసీసీ వైస్-ఛైర్మన్, సీఈఓ స్వయంగా ఈ ఇద్దరు అధికారుల మధ్య ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చొరవ చూపారు.దేవజిత్ సైకియా మాట్లాడుతూ, "చర్చల ప్రక్రియను ప్రారంభించడానికి ఇది చాలా గొప్ప అవకాశం. ఇరు పక్షాలు సామరస్యపూర్వకంగా చర్చల్లో పాల్గొన్నాయి" అని తెలిపారు. ఈ సమస్య త్వరలో సానుకూల పద్ధతిలో పరిష్కరించబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.