వెస్టిండీస్ టూర్లో టీమిండియాలో చోటు దక్కని ప్లేయర్లు చాలా మంది ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో రాణించడం ఆ ప్లేయర్లకు చాలా కీలకం. ఎందుకంటే వీళ్లు రాణిస్తే.. సెలెక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అలాలేదు. స్టార్ ప్లేయర్లు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ దారుణంగా ఫెయిలయ్యారు.
వీళ్లిద్దరూ కూడా వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రియాంక్ పాంచల్ సారధ్యంలో ఆడుతున్న వెస్ట్ జోన్లో వీరితోపాటు ఛటేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్ వంటి కీలకమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ టీం సెమీఫైనల్లో శివమ్ మావి నేతృత్వంలోని సెంట్రల్ జోన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో వెస్ట్ జోన్ ఫేవరెట్గా బరిలో దిగింది. కానీ మ్యాచ్ మాత్రం అలా సాగడం లేదు.

తొలి ఇన్నింగ్స్లో పృథ్వీ షా కేవలం 26 పరుగులకే అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఏడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ టోర్నీ వీరిద్దరితోపాటు సర్ఫరాజ్ ఖాన్, ఛటేశ్వర్ పుజారా వంటి వారికి కూడా కీలకం. పృథ్వీ షా చాలా కాలంగా టీమిండియాలోకి పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో విండీస్ టూర్ టెస్టుల్లో పుజారా స్థానం కోల్పోయాడు.
సర్ఫరాజ్ పేరు కూడా విండీస్ టూర్లో లేదు. సర్ఫరాజ్ ఈ టోర్నీలో రాణించి, టెస్టు జట్టులోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. విండీస్తో టెస్టుల్లో సూర్యకు చోటు దక్కకపోయినా వన్డే టీంలో స్థానం దక్కింది. ఈ ఫార్మాట్లో సూర్య రికార్డు అంతగొప్పగా లేకపోయినా.. ఈ ఏడాది ఐపీఎల్లో అతను చెలరేగాడు. ఈ కారణంగానే అతనికి విండీస్ టూర్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పృథ్వీ షా, సర్ఫరాజ్ ఇద్దరూ తేలిపోయారు. అయితే రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ రికార్డు అద్భుతంగా ఉంది. దులీప్ ట్రోఫీలో ఇలా ఫెయిలవడం సూర్య, పృథ్వీ షా ఇద్దరికీ మంచిది కాదు. ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఏ ఫార్మాట్లో అయినా సరే.. టీమిండియాలో స్థానాల కోసం చాలా గట్టి పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో వీళ్లు ఫెయిలైతే వారి స్థానాల్లో కొత్త వారు దూసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లు రాణిస్తేనే టీమిండియాలో చోటు కాపాడుకోగలుగుతారు.