IPL 2025 SuryaKumar Yadav: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ యాదవ్ మంచిగానే రాణిస్తూ జట్టు విజయాల్లో తనవంతు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 23 బంతుల్లో 4×4, 3×6 సాయంతో 48 నాటౌట్ పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచుకు ముందుకు తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. 2020-21 ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడం ఎంతగానో బాధించిందని అన్నాడు. అయితే ఈ పరిణామం.. తాను ఐపీఎల్లో అత్యంత చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడేందుకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నాడు.
అబుదాబిలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 43 బంతుల్లో 79 పరుగులు చేసిన సూర్య.. ఆ మ్యాచులో ముంబై ఇండియన్స్కు ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. దీని గురించి సూర్య మాట్లాడుతూ.. "అది ఎమోషనల్ నాక్. ఎందుకంటే మ్యాచ్కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును అనౌన్స్ చేశారు. ఈ టూర్ కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమయ్యాను. దేశవాళీ సీజన్, ఐపీఎల్ కూడా బానే ఆడాను. కరోనా విరామ సమయంలో ఫిట్నెస్, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. కచ్చితంగా టీ20 జట్టులో నాకు చోటు దక్కుతుందని భావించాను. నా చుట్టూ ఉన్న ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు కూడా నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాననే అనుకున్నారు. మానసికంగా నేను కూడా విమానంలో ఉన్నట్లు అనిపించింది. కానీ నేను సెలక్ట్ అవ్వలేదు. అది నన్ను ఎంతగానో బాధించింది. ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కాలేదు."

"దీంతో ఎవరితోనూ మాట్లాడలేదు. కొన్ని రోజులు విరామం తీసుకున్నాను. 2-3 రోజుల పాటు అదే ఆలోచించా. ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వెళ్లాను. అప్పుడు మహేల జయవర్దనె, జహీర్ ఖాన్ కూడా నా పరిస్థితిని గమనించారు. ఆ తర్వాత కీరన్ పోలార్డ్ నా దగ్గరికి వచ్చాడు. ఆర్సీబీ మ్యాచ్కు ముందు వచ్చి ఇలా అన్నాడు. 'నాకు తెలిసి ఇదే సరైన వేదిక. భారత్ కెప్టెన్ కోహ్లీ కూడా ప్రత్యర్థి జట్టులోనే ఉన్నాడు. నీ స్థానం ఏంటో నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం' అని అన్నాడు." అని సూర్య వివరించాడు.