Surya Kumar Yadav: ఆసియా కప్ 2025లో భారత్, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇది క్రీడా స్ఫూర్తితో కూడుకున్న చర్య అయినప్పటికీ.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ్ చోప్రా లాంటి మాజీ క్రికెటర్లు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన సూర్యకుమార్ యాదవ్
బుధవారం యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యూఏఈ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ను భారత ఆల్రౌండర్ శివమ్ దూబే వేస్తున్నాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ.. దూబే వేసిన బౌన్సర్ కు అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో బౌలర్ శివమ్ దూబే పరిగెడుతుండగా.. అతని నడుముకు ఉన్న టవల్ కిందపడిపోయింది. దీనిని గమనించి అంపైర్ కు సూచిస్తూ జునైద్ సిద్దిఖీ అజాగ్రత్తగా క్రీజు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ వికెట్ల వైపు బంతిని విసిరి రనౌట్ చేశాడు. జునైద్కు థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో జునైద్ సిద్దిఖీ మైదానం వీడకుండా అక్కడే నిలబడి చూస్తుండగా.. టీమిండియా కెప్టెన్ కెప్టెన్ సూర్యకుమార్ అంపైర్లతో చర్చించాడు. బౌలర్ టవల్ జారిపోవడం వల్లే బ్యాటర్ దృష్టి మరలిందని గ్రహించిన సూర్య కుమార్ యాదవ్.. తమ అప్పీల్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో జునైద్ సిద్ధిఖీ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్లో శివమ్ దూబే విసిరిన బంతికి సిద్ధిఖీ ఔటయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్తో కూడా ఇలాగే చేస్తారా?
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నిర్ణయం యూఏఈతో మాత్రమే సాధ్యమని.. పాకిస్థాన్ తో కూడా ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. "నా అభిప్రాయం ప్రకారం, ఇది ఈవెంట్-స్పెసిఫిక్. సెప్టెంబర్ 14న పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఇలానే క్రీజ్ వెలుపల తిరుగుతూ ఉండి, మ్యాచ్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు సూర్యకుమార్ ఇలా చేయడు" అని ఆకాశ్ చోప్రా అన్నారు. అలాగే, క్రీడా స్ఫూర్తి పేరుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని, ఇది ఆటలో అనవసరమైన గందరగోళానికి దారితీస్తుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఒకవేళ జునైద్ క్రీజ్ బయట ఉంటే, అది రనౌట్ కాబట్టి ఔట్ ఇవ్వడమే సరైనదని ఆయన అన్నారు.
బీసీసీఐ, ఐసీసీ లాంటి సంస్థలు క్రీడా స్ఫూర్తికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ఆటలో నియమ నిబంధనలకు కట్టుబడడం ముఖ్యమని ఈ సంఘటన మరోసారి చర్చకు దారితీసింది. సూర్యకుమార్ నిర్ణయంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.