CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై శనివారం జరిగిన మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ అద్భుతమైన ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఘనవిజయం అందించాడు. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 15 పరుగులు అవసరం. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు క్రీజులో ఉన్నారు. కానీ బెంగళూరు 2 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా రెండో సీజన్లో చివర్ ఓవర్ థ్రిల్లర్లో బెంగళూరును విజయపథంలో నడిపించడం ద్వారా తాను ఛాంపియన్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో దాని స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయినప్పటికీ.. కానీ సీఎస్కే 17 ఏళ్ల యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే తన విస్పోటక బ్యాటింగ్తో అందరి మనస్సులను దోచుకున్నాడు. ఆయుష్ మాత్రే బ్యాటింగ్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయుష్ మాత్రే 48 బంతులు ఎదుర్కొని 94 పరుగులు చేశాడు. 195.83 స్టైక్ రేట్తో మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆయుష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఆయుష్ మాత్రే తన సెంచరీతో పాటు మ్యాచ్ గెలిపించే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అతడిపై ప్రశంసలు గుప్పించాడు.

ఆయుష్ మాత్రే గురించి సూర్య కుమార్ యాదవ్ ఏమన్నాడంటే?
ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆయుష్ మాత్రే గురించి ఒక ప్రత్యేక ట్వీట్ చేశాడు. "దృఢ సంకల్పం, ధైర్యం, ఉత్సాహంతో నిండిన ఇన్నింగ్స్!"అని సూర్యకుమార్ యాదవ్ ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ గురించి ట్వీట్ చేశాడు. ఈ పేరు గుర్తుంచుకోవాలని.. భవిష్యత్తు ఇక్కడ ఉందన్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన తర్వాత ఆయుష్ మాత్రేను సీఎస్కే జట్టులో చేర్చిన సంగతి తెలిసిందే. ఆయుష్ మాత్రే ముంబై తరఫున దేశీయ క్రికెట్ ఆడుతాడు. ఆయుష్ మాత్రే ఆడుతున్న తీరు చూస్తుంటే వచ్చే సీజన్ వరకు సీఎస్కే ఆయుష్ మాత్రేను జట్టులోనే ఉంచుకోవాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.