ఐపీఎల్-2024 వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ మినీ వేలం దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్లో, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.
అయితే దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆ జట్టు కెప్టెన్ పంత్ వేలంలో పాల్గొంటున్నాడు. ఈ అనుభవం తనకి లేదని, ఇది గొప్పగా సాగుతుందని భావిస్తున్నట్లు పంత్ తెలిపాడు. ''వేలంలో టేబుల్పై కూర్చోవాలని, జట్టుకు సాయంచేయాలని చిన్నతనంలో అనుకున్నా. కానీ ఇది ఇప్పుడే జరుగుతుందనుకోలేదు. దీనిలో నాకు అసలు అనుభవమే లేదు. కానీ మంచిగా సాగుతుందని ఆశిస్తున్నా.వేలంలో మేం కోరుకున్న ప్లేయర్లు దక్కుతారని భావిస్తున్నా'' అని పంత్ అన్నాడు.

గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు ఏడాది పాటు క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే. దీనిపై పంత్ స్పందిస్తూ.. '' నాకు జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డా. భరించలేని నొప్పితో విలవిలలాడినా. అయితే అప్పటినుంచి పోలిస్తే గొప్పగానే కోలుకున్నా. ఆ టైమ్లో ప్రజల ముందుకు ఎలా రావాలో అర్థం కాలేదు. కానీ దిల్లీ క్యాపిటల్స్కు సపోర్ట్ చేయాలనుకున్నా. ఆ ఉద్దేశంతో స్టేడియానికి వచ్చా'' అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్లకు సపోర్ట్ చేయడానికి పంత్ వచ్చిన విషయం తెలిసిందే.
'' ఇక ప్రతి ప్లేయర్ తమ తొలి వేలాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. రూ. పది లక్షల బేసిక్ ప్రైజ్తో వేలంలో ఉన్న నన్ను రూ.1.9 కోట్లకు దిల్లీ తీసుకుంది. ఆ టైమ్కు అండర్-19 ఆడిన నాకు ఆ ధర క్రేజీగాఅనిపించింది. గత ఏడాది నుంచి ఆటకు దూరంగా ఉన్న నాకు మద్దతు నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు'' అని పంత్ తెలిపాడు.
వేలంలో పాల్గొనడానికి దిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్లు ఉన్నాయి. జట్టులో ఖాళీలు తొమ్మిది ఉండగా విదేశీ ప్లేయర్లకు నాలుగు స్లాట్స్ ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే గుజరాత టైటాన్స్ వద్ద అత్యధిక డబ్బు ఉంది. గుజరాత్ వద్ద రూ.38.15 కోట్లు ఉన్నాయి.