మరో నెల రోజుల్లో టీమిండియా టెస్టు ఫార్మాట్ సందడి మొదలుకానుంది. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే భారత్కు ఈ సిరీస్ల్లో విజయం తప్పనిసరి.
కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్గానే బరిలోకి దిగుతోంది. అయితే భారత్తో జరిగే ఈ టెస్టు సిరీస్లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తమకు కొరకరాని కొయ్యగా మారుతాడని ఆస్ట్రేలియా ప్రధాన సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జైస్వాల్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

అయిదు మ్యాచ్ల్లో 712 పరుగులు సాధించాడు. సెంచరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్తోనే తమకు ప్రమాదకరమని లైయన్ అన్నాడు. అంతేగాక జైస్వాల్ జోరుకు కళ్లెం వేయడానికి ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్లీతో కూడా మాట్లాడానని తెలిపాడు. ''జైస్వాల్తో ఇప్పటివరకు తలపడలేదు. కానీ, మాలాంటి బౌలర్లందరికీ ఆ కుర్రాడు పెద్ద సవాల్. ఇంగ్లాండ్పై అతను ఆడిన విధానాన్ని చాలా దగ్గరగా గమనించాను. అతను అద్భుతంగా ఆడాడు. జైస్వాల్ గురించి టామ్ హార్ట్లీతో మాట్లాడాను. భిన్న బౌలర్లను విభిన్నమైన శైలిలో ఆడటం ఆసక్తికరంగా అనిపించింది''

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.