హైదరాబాద్: వివాహ బంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కోహ్లీ-అనుష్క దంపతులకు అటు బాలీవుడ్తో పాటు ఇటు క్రికెట్ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
భారత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ కూడా చేరాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చక్కటి స్నేహాభావం ఉంది. కోహ్లీతో ఉన్న అనుబంధంతో డివిలియర్స్ తనదైన శైలిలో మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపాడు.
'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు శుభాకాంశ్రలు. మీ పెళ్లి వార్త విని సర్ప్రైజ్కు గురయ్యా. కానీ నువ్వు ఇలా సర్ప్రైజ్లు ఇస్తుంటావని నాకు తెలుసు. మీరిద్దరూ ఎంతో ఆనందంగా జీవితం గడుపుతారని భావిస్తున్నా. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరుకుంటున్నా' అని ఏబీ డివిలియర్స్ అన్నాడు.
హనీమూన్ కోసం విరుష్క జంట ప్రస్తుతం రోమ్లో పర్యటిస్తోంది. అద్భుతమైన వాతావరణం, అందమైన బీచ్లకు రోమ్ పెట్టింది పేరు. ఇందులో భాగంగానే హానీమూన్ కోసం వీరిద్దరూ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న వీరిద్దరూ డిసెంబర్ 21న ఢిల్లీలో.. డిసెంబర్ 26న ముంబైలో రిసెప్షన్ ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ రిసెప్షన్కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్లాగా అతిథులకు అందజేశాడు. పెళ్లి కోసమే లంకతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.