న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ మాజీ గ్రేట్ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ శుక్రవారం తన ఆల్ టైమ్ గ్రేట్ వరల్డ్ ఎలెవన్ జట్టుని ప్రకటించాడు. ఆశ్చర్యం ఏమిటంటే జెఫ్రీ బాయ్ కాట్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్కు చెందిన క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్లకు చోటు దక్కలేదు.
అయితే జెఫ్రీ బాయ్ కాట్ విడుదల చేసిన ఆల్ టైమ్ గ్రేట్ వరల్డ్ ఎలెవన్ జట్టులో పాకిస్ధాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు చోటు లభించింది. అంతేకాదు జెఫ్రీ బాయ్ కాట్ వరల్డ్ ఎలెవన్లో ఇమ్రాన్ ఖాన్కు కెప్టెన్ హోదా కట్టబెట్టాడు. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన జెఫ్రీ బాయ్ కాట్ ఓ ఒక్క భారతీయ ఆటగాడికి కూడా తన జట్టులో స్థానం ఇవ్వకపోవడాన్ని సమర్ధించుకున్నాడు.

సెంచరీల ఆధారంగానే తన జట్టు ఆటగాళ్ల ఎంపిక జరిగిందని చెప్పిన జెఫ్రీ బాయ్ కాట్ భారత ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై వివరణ ఇచ్చాడు. 'ఎంపిక చేసిన జట్టులో నేను కూడా లేను. గవాస్కర్ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు గవాస్కర్ అత్యంత మిత్రుడు.
ఈ క్రమంలో గ్రాస్, హోబ్స్ స్ధానంలో అతడిని ఎంపిక చేసి ఉండొచ్చు? గ్రేస్ నెంబర్స్ను ఒక్కసారి చూడండి. అయితే ప్రస్తుత క్రికెటర్లతో వారిని పోల్చలేం' అని చెప్పుకొచ్చాడు. 'తాను ఆడే సమయంలో పిచ్ పూర్తిగా రాళ్లతో నిండి ఉండేది. పిచ్ డ్రై అయ్యేందుకు గాను మధ్యాహ్నాం 2 గంటల వరకు వేచి చూసేవారు.
ప్రస్తుతం వెట్ వికెట్ల పిచ్ని రూపొందిస్తే పిచ్చివాళ్లలాగా చూస్తున్నారు' అని ఆయన మండిపడ్డారు. ఓపెనింగ్ విభాగంలో డబ్యూజీ గ్రాస్, సర్ జాక్ హాబ్స్ లే గవాస్కర్ కంటే ఉత్తమమని బాయ్ కాట్ తెలిపాడు. అదే క్రమంలో మరొకవైపు విండీస్ మాజీ ఆటగాళ్ల వివ్ రిచర్డ్స్, సోబర్స్లకు బాయ్ కాట్ ఆల్ టైమ్ గ్రేట్ ఎలెవన్లో చోటు లభించింది.

1992 వరల్డ్ కప్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖానే తన జట్టుకు సరైన నాయకుడిగా బాయ్ కాట్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున 108 టెస్టులాడిన జెఫ్రీ బాయ్ కాట్ 47.72 యావరేజితో 8,114 పరుగులు చేశాడు. టెస్టుల్లో జెఫ్రీ బాయ్ కాట్ 248 (నాటౌట్)గా ఉంది.