
హోటల్ గదిపై రైనా అసంతృప్తి:
ఒక జాతీయ పత్రిక కథనం ప్రకారం... ఆగష్టు 21న దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బీసీసీఐ రూల్స్ ప్రకారం 6 రోజుల ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. దుబాయ్లో తనకు కేటాయించిన గది.. రైనాకు మొదటి రోజే నచ్చలేదు. కనీసం ఆ గదికి సరైన బాల్కనీ కూడా లేదని రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇచ్చిన తరహా గది తనకు కావాలంటూ కోరాడట. అయితే ప్రాంచైజీ నుండి స్పందన రాకపోవడంతో.. చివరకు ధోనీకే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోనీ.. రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో మహీపై కూడా అసహనం కనబరుస్తూ.. రైనా వ్యక్తిగత కారణాలు అంటూ స్వదేశం వచ్చాడు.

అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు:
సురేష్ రైనా వ్యవహారంపై చెన్నై జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజాగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'క్రికెటర్లు కూడా పాత తరం సినిమా తరల్లానే తమ గురించి తాము బాగా గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై జట్టులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను. కొన్నిసార్లు విజయం తలకెక్కడం సహజం' అని శ్రీనివాసన్ అన్నారు.

జట్టులో ప్రతిభకు కొదవ లేదు:
'మా జట్టుకు ఎంఎస్ ధోనీ రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. అతనితో నేను మాట్లాడా. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందన్నాడు. ఒక వేళ జట్టులో కరోనా కేసులు పెరిగినా.. భయపడనవసరం లేదని చెప్పాడు. జట్టులో ప్రతిభకు కొదవ లేదు. సురేష్ రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు' అని శ్రీనివాసన్ మండిపడ్డారు.

ఇకపై కింగ్స్కు ఆడడా?:
అయితే 2008 నుంచి చెన్నై తరఫున ఆడుతున్న సురేష్ రైనా.. కేవలం హోటల్ గది గురించి తప్పుకోడని, ప్రాంచైజీతో ఇంకా పెద్ద గొడవే జరిగినట్టు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్కు ఆడడని, వచ్చే ఐపీఎల్ కోసం వేలంలో ఉండబోతున్నాడని ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదేమైనా శ్రీనివాసన్ మాటలను బట్టి చూస్తే.. గొడవజరిగిందని మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేంటనేది ప్రస్తుతం బయటకి రాకపోయినా.. రాబోయే రోజుల్లో మాత్రం తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












