
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒకప్పుడు అగ్రశ్రేణి ప్లేయర్గా వెలుగొందిన సురేశ్ రైనా.. గతేడాది మెగా వేలంలో అమ్ముడుపోలేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా రూ.2కోట్ల బేస్ ప్రైస్తో వేలంలో నమోదు చేసుకున్నా.. పది ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ సైతం ఈ సీఎస్కే స్టార్ను కొనడానికి ఆసక్తి చూపలేదు. అమ్ముడుపోనప్పటికీ.. రైనాను ఆఖరికి ఏదో ఒక జట్టుతో భర్తీ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అది కూడా జరగలేదు. దీంతో మిస్టర్ ఐపీఎల్.. పూర్తిగా మిస్సయ్యాడు.
ఇక ఆటకు దూరమైనప్పటికీ.. రైనా ఎలైట్ కామెంటరీ ప్యానెల్లో సభ్యుడిగా చేరి కామెంట్రీ కూడా చేశాడు. ఇక తాజాగా ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ విజృంభించడంతో పాటు దక్షిణాఫ్రికాలో కొత్త టీ20లీగ్ త్వరలోనే జరగబోతుండడంతో రైనాకు అవకాశాలు తలుపుతట్టొచ్చని, ఎందుకంటే ఆన్ డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో రైనా ఒకడని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇకపోతే దక్షిణాఫ్రికాలో త్వరలో ప్రారంభం కానున్న టీ20 టోర్నమెంట్లో పాల్గొనే మొత్తం ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంఛైజీలే కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇది రైనాకు అనుకూలంగా పని చేస్తుందని చోప్రా అభిప్రాయపడ్డారు. 'భారత ఫ్రాంచైజీలు CSA టీ20 లీగ్లో మొత్తం ఆరు జట్లను కొనుగోలు చేసినప్పుడు, అది పూర్తిగా ఇండియన్ లీగ్లా మారుతుందన్నాడు.
అందువల్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను వేర్వేరు ప్రదేశాల్లో ఆడాలని కోరుకోవచ్చని తెలిపాడు. నిజానికి సురేష్ రైనా ఫ్రాంఛైజీ క్రికెట్లో రాణించడాన్ని నేను చూస్తున్నాను అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. రైనా చాలా ఆసక్తికరమైన ప్లేయర్ అని అతని కోసం డబ్బులు పెట్టడానికి ఫ్రాంఛైజీలు ముందుకొస్తాయని చెప్పాడు.