అడిలైడ్: ఐసిసి వన్డే ప్రపంచ కప్ భారత జట్టులో తన కుమారుడిని తీసుకోకపోవడానికి కెప్టెన్ ధోనీ కారణమని యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో బిసిసిఐ వెబ్సైట్లో సురేష్ రైనా ఇంటర్వ్యూ వచ్చింది. ఆ విమర్శలకు విరుగుడుగానే సురేష్ రైనా ఇంటర్వ్వూ వచ్చినట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో సురేష్ రైనా గత ప్రపంచ కప్ పోటీల్లో యువరాజ్ సింగ్ పాత్రను తాను పోషిస్తానని చెప్పాడు.
పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో దూకుడు ప్రదర్శించి, 56 బంతుల్లో 76 పరుగులు చేసిన రైనా ఇక ముందు కూడా అదే దూకుడు ప్రదర్శించాలని అనుకుంటున్నాడు. యువరాజ్ సింగ్ లాగానే ఆడి మ్యాచును భారత్ వైపు మళ్లించే ఆట ఆడాలని భావిస్తున్నాడు.
అవసరమైనప్పుడు ఆధిపత్యం ప్రదర్శిస్తానని, అదే సమయంలో స్ట్రైక్ను రొటేట్ చేస్తూ సంయమనంతో ఆడుతానని, తన తోటి బ్యాట్స్మన్తు చేదోడువాదోడుగా ఉంటానని చెప్పాడు. తాను స్ట్టెయిట్గా ఆడుతూ స్కోరు సాధించడానికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటానని చెప్పాడు. కొంత మంది బౌలర్ల బంతుల్లో పరుగులు రాబట్టలేనప్పుడు సెన్సిబుల్గా ఆడాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు.

కెప్టెన్ ధోనీ, యువరాజ్ సింగ్ లోయర్ ఆర్డర్లో అడిన పద్ధతి చూసి చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు. ఇన్స్టింక్ట్ను ఫాలో కావాల్సి ఉంటుందని, దాన్ని కూడా తాను ధోనీ నుంచీ యువరాజ్ నుంచీ నేర్చుకున్నానని రైనా చెప్పాడు. యువరాజ్ ఎలా గేమ్ను ఫినిష్ చేసేవాడో తాను జాగ్రత్తగా పరిశీలించినట్లు తెలిపాడు. ప్రపంచ కప్ పోటీల్లో తాను యువరాజ్ సింగ్ పాత్రను పోషిస్తానని చెప్పాడు.
తాను ఫీల్డింగ్, బ్యాటింగ్లతో పాటు బౌలింగ్ కూడా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్లో ఎంత ప్రతిభ కనబరిచేవాడో ఫీల్డింగ్లోనూ అంతే రాణించేవాడు. అవసరమైనప్పుడు బౌలింగు ద్వారా కీలకమైన వికెట్లు తీసి, మ్యాచును మలుపు తిప్పేవాడు. భారత్ తదుపరి మ్యాచ్ ఈ నెల 22వ తేదీన మెల్బోర్న్లో దక్షిణాఫ్రికాపై జరుగుతుంది.