
ఘాజియాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఫిట్నెస్ సాదించేందుకు ఇంటి వద్దే సాధన చేస్తున్నాడని భారత వెటరన్ ఆటగాడు సురేష్ రైనా వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం దుబాయ్కి వెళ్లేందుకు తామంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెన్నై సీనియర్ ఆటగాడు అన్నాడు. లీగ్ ఆరంభానికి 18-20 రోజుల ముందుగానే యూఏఈకి చేరుకొనే అవకాశం ఉందన్నాడు. లాక్డౌన్ వల్ల నాలుగు నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదని రైనా చెప్పాడు.
తాజాగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'మాకు క్యాంపు ఉంటుంది. మేం చేయాల్సింది చాలా ఉంది. 18-20 రోజులు ముందుగానే యూఏఈకి వెళ్లొచ్చు. ఐపీఎల్ రాబోతోంది కాబట్టి ముందే అక్కడికి వెళ్లడం మంచిది. ఇక లాక్డౌన్ సమయంలో 4-5 నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకే ముందే అక్కడికి వెళ్తే ఉత్సాంగా ఉంటుంది. చెన్నై సూపర్కింగ్స్ సభ్యులంతా ఇంటి వద్దే తీవ్రంగా సాధన చేస్తున్నారు. అంతా ప్రణాళికాబద్ధంగా సాగుతోంది' అని అన్నాడు.
'చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంటి వద్దే తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ ఆడేందుకు ఎక్కువ ఫిట్నెస్ అవసరం. రిషబ్
పంత్తో కలిసి సాధన చేస్తున్నా. అతడు బంతిని చక్కగా బాదుతున్నాడు. పంత్ దూకుడైన ఆటగాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ఆ జట్టు సభ్యులు అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే మీరు అద్భుతమైన ప్రదర్శనలు చూడగలరు' అని సురేష్ రైనా సలహా ఇచ్చాడు.
'మొహమ్మద్ షమీ ని నేను నెట్స్లో ఎదుర్కొన్నాను. బౌలర్లంతా ఇక్కడికే వచ్చి సాధన చేస్తున్నారు. పియూష్ చావ్లా కూడా ఇక్కడికే వచ్చాడు. అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. దీపక్ చాహర్ ఇంటివద్దే ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు కష్టపడాల్సిందే. ఎందుకంటే ఈ ఆటకు మరింత అంకితభావం, ఫిట్నెస్ అవసరం' అని చెన్నై సీనియర్ ఆటగాడు రైనా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రైనా ఘాజియాబాద్లో సాధన చేస్తున్నాడు. పంత్, షమీ సైతం అక్కడే శిక్షణ పొందుతున్నారు.
ఆగస్టు రెండో వారంలోనే ఆటగాళ్లు, సిబ్బందిని ఫ్రాంచైజీలు యూఏఈకి తీసుకెళ్లాలని మొదటగా జట్టు యాజమాన్యాలు ఆలోచించాయి. అయితే ప్రయాణాన్ని వారం పాటు ఆలస్యం చేసుకోవాలని ఐపీఎల్ పాలక మండలి సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రొటోకాల్స్ పాటించి, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు సమయం పడుతుందని భావించిన సీజీ.. ఫ్రాంచైజీలకు సూచనలు చేసింది. దీంతో ఐపీఎల్ కోసం ఆగస్టు 20వ తేదీలోగా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లనున్నారు.