మోకాలి గాయానికి సర్జరీ
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో సురేశ్ రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఫిట్నెస్ సాధించేందుకు తంటాలు పడుతున్నాడు. తాజాగా రైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు.
వరల్డ్కప్ రేసులో నేను కూడా నిలవొచ్చు
'నేను ఎక్కడ క్రికెట్ ఆడినా నా ఆటను ఎప్పుడూ ఆస్వాదించాను. ప్రస్తుతం లక్ష్యాలను ఏమీ నిర్దేశించుకోలేదు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నా. ఎందుకంటే.. మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడగలనని తెలుసు. 2020 ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తే.. అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్కప్ రేసులో నేను కూడా నిలవొచ్చు. నేను టీ20 క్రికెట్లో బాగా రాణించాను. అయితే టీ20 వరల్డ్కప్ ఆశలు ఐపీఎల్లో నా ఆటతీరుపై ఆధారపడి ఉంటాయి' అని రైనా పేర్కొన్నాడు.
ధోనీ అవసరం టీమిండియాకి ఇప్పటికీ ఉంది
ఐపీఎల్ నా అంతర్జాతీయ భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు. కానీ నేను ఆడాలనుకుంటే మంచి ప్రదర్శన ఇవ్వాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ జట్టులోకి రావడానికి ఐపీఎల్ ఉత్తమ వేదిక. నేను ఎలాంటి ఆటగాడినో అందరికీ తెలుసు అని రైనా అన్నాడు. ఎంఎస్ ధోనీ అవసరం టీమిండియాకి ఇప్పటికీ ఉంది. కోహ్లీ తీసుకోబోయే నిర్ణయంపైనే ధోనీ కెరీర్ ఆధారపడి ఉంది. కోహ్లీనే అంతిమ నిర్ణయం తీసుకోవాలి' అని రైనా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కోసం మార్చి తొలి వారంలో చెన్నైలో నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్కి ధోనీ హాజరుకానున్నాడు.
పేలవ ఫామ్తో చోటు కోల్పోయిన రైనా
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో తరచుగా మ్యాచ్లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు.