రోహిత్ కెప్టెన్సీ ధోనీని పోలి ఉంటుంది:
స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ పేజీలో తాజాగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'రోహిత్ కెప్టెన్సీ ధోనీని పోలి ఉంటుంది. రోహిత్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. పుణేతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్సీ చూశా. ఆ మ్యాచ్ కీలక సమయంలో సరైన నిర్ణయాలతో తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ముంబై కెప్టెన్గా 2-3 గొప్ప ఎత్తుగడలు వేశాడు. అవి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓవర్ల మధ్య మార్పులు చేసిన విధానం బాగుంది. నిర్ణయాలన్నింటినీ అతడు స్వయంగా తీసుకుంటాడు. బయటి నుండి కొన్ని సలహాలు వస్తాయి కానీ.. ఆ సమయంలో ఏమి చేయాలో అతనికి తెలుసు' అని అన్నాడు.
రోహిత్ బిందాస్ ప్లేయర్:
'రోహిత్ శర్మలో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలాంటి ప్లేయర్ మిగతా సహచరుల్లో స్ఫూర్తినింపగలడు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా, ఏమాత్రం తొణకకుండా రోహిత్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్గా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ బిందాస్ ప్లేయర్. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. పరుగులు చేస్తాడు. బ్యాటింగ్ దిగిన ప్రతిసారి పరుగులు సాధిస్తాననే నమ్మకమున్న అరుదైన ప్లేయర్' అని రైనా పేర్కొన్నాడు.
ప్రత్యేక సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు:
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీపై కూడా సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. '2015 ప్రపంచకప్ సందర్భంగా నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాడు. ఆ మ్యాచ్లో 70-80 పరుగులు చేశాను. ఆ సాయంత్రం నేను ధోనీ వద్దకు వెళ్లి.. ఎందుకు నన్ను ఆ స్థానంలో పంపిచావ్ అని అడిగా. "ప్రత్యర్థి జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు, అందుకే టాపార్డర్లో ఆడించా" అని సమాధానం ఇచ్చాడు. ధోనీ ఆలోచన తీరు చాలా ముందుంటుంది. అనేక విషయాలో తనకున్న అవగాహన అద్భుతం. మహీ స్టంప్స్ వెనుక నిలబడి అన్నీ గ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా అతనికి కొంత ప్రత్యేక సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు, అందుకే అతను ఇంత విజయవంతమైన నాయకుడు అయ్యాడు' అని రైనా చెప్పుకొచ్చాడు.
రైనా ఆశలకు కరోనా గండి:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13 జరుగుతుందో లేదో తెలియదు. దీంతో రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
గతేడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున సురేశ్ రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. 78 టీ20 మ్యాచ్లాడి 134.79 స్ట్రైక్రేట్తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.