సురేష్ రైనా చేసిందే తొలి సెంచరీ
అప్పటివరకు భారత్ తరఫున సురేష్ రైనా చేసిందే తొలి సెంచరీ కాగా.. ఆ తర్వాత రోహిత్ శర్మ నాలుగు శతకాలు, లోకేశ్ రాహుల్ రెండు సెంచరీలు చేశారు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. సెయింట్ లూసియా వేదికగా జరిగిన పోరులో టాస్ గెలిచిన సఫారీలు మొదట బౌలింగ్ తీసుకున్నారు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ మురళీ విజయ్ (0) పెవిలియన్ చేరాడు. దీంతో రైనా తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కి వెళ్లిన రైనా.. చివరి ఓవర్ వరకూ సఫారీ బౌలర్లని ఉతికారేశాడు.
యువరాజ్ సింగ్ నుంచి చక్కటి సహకారం
సురేష్ రైనా మొదటగా 42 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేయగా.. ఆ తర్వాత 59 బంతుల్లోనే సెంచరీ మార్క్ని చేరుకున్నాడు. అతడికి యువరాజ్ సింగ్ నుంచి చక్కటి సహకారం లభించింది. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్లో యూసుఫ్ పఠాన్ 2 వికెట్లు పడగొట్టడంతో ప్రొటీస్ ఆఖరుకు 172/5 కే పరిమితమైంది. ఫలితంగా 14 పరుగుల తేడాతో భారత్ జయభేరీ మోగించింది. ఆ ఇన్నింగ్స్ను తానెప్పటికీ మరువలేనని రైనా శనివారం ట్విట్టర్ ద్వారా అన్నాడు.
రైనా ఆశలకు కరోనా గండి:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
గతేడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 మ్యాచ్లాడి 134.79 స్ట్రైక్రేట్తో 1604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.