న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏడాది అనంతరం... అంతకుముందు రోజు ఏం జరిగిందనే విషయాన్ని సురేష్ రైనా వెల్లడించాడు. ధోని టెస్టుల నుంచి రిటైరయ్యే అవకాశముందని తనకు అతడు వీడ్కోలు పలికిన ముందు రోజే అర్థమైందని రైనా చెప్పాడు.
టెస్టులకు ధోని వీడ్కోలుపై ఎవరికీ ముందస్తు సమాచారం లేదని, అయితే అతడు నిర్ణయం ప్రకటించే ముందు రోజు తన వద్దకు వచ్చి.. నా నా దగ్గర పెద్ద చొక్కా (టెస్టు జెర్సీ) అదనంగా ఉందని, నువ్వు తీసుకోమని చెప్పాడని, అప్పుడే ఏదో జరగబోతోందని తనకు అర్థమైందన్నాడు.
అందుకే మరుసటి రోజు ఉదయం చొక్కాపై అతడి ఆటోగ్రాఫ్ తీసుకున్నానని, ఉదయం టిఫిన్ చేసే సమయంలో ఎవరితోనూ అతడు మాట్లాడలేదని, ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు సహచరులందరినీ పిలిచి వీడ్కోలుపై తన నిర్ణయాన్ని ప్రకటించాడని చెప్పాడు. రేపటి నుంచి ఈ టెస్ట్ జెర్సీని వేసుకోనని చెప్పాడన్నాడు. ఆ రోజు రాత్రి టెస్టు జెర్సీతోనే అతడు నిద్రించాడని చెప్పాడు.
జట్టు ఓడినా గెలిచినా ధోనీపై విమర్శలు మాత్రం తగ్గడం లేదని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్కు ధోని ఎప్పుడు వీడ్కోలు పలుకుతాడన్న ప్రశ్నలు ఆగడం లేదని, ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న ధోని భారత జట్టుకు గొప్ప విజయాలెన్నో అందించాడని గుర్తు చేశాడు. ప్రస్తుతం కఠిన పర్యటనలో ఉన్నాడని, మద్దతు కావాలన్నాడు.
అయితే కెప్టెన్గా అతడు విమర్శలనూ భరించాల్సిందేనని, కానీ గెలిచినా అతడిని దెప్పిపొడిచే వారు లేకపోలేదని, ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉంటున్నాడని, ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నాడు. ధోనీ రిటైర్ అయ్యాక అతని విలువ అర్థమవుతుందని చెప్పాడు. ధోనికి మద్దతు లభిస్తే కచ్చితంగా అతడు దేశానికి మరో ట్వంటీ 20 ప్రపంచ కప్ అందించగలడని ధీమా వ్యక్తం చేశాడు.