హైదరాబాద్: యో యో పరీక్షలో విఫలమైన అంబటి రాయుడిపై ఊహించినట్లే వేటు పడింది. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2018 సీజన్లో అద్భుత ప్రదర్శన చేసి, ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు తెలుగు తేజం అంబటి రాయుడు. యో యో ఫిట్నెస్ ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే జట్టుకు ఎంపికైన రాయుడు.. తాజాగా ఫిట్నెస్ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో సెలక్టర్లు అతణ్ని జట్టు నుంచి తప్పించారు.
శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యో-యో ఫిట్నెస్ టెస్టుకు హాజరైన అంబటి రాయుడు కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. నిర్దేశిత (16.1) ప్రమాణం అందుకోలేక పోవడంతో రాయుడు ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో స్థానం కోల్పోయాడు.
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాడు సురేశ్ రైనాకు చోటు కల్పించారు. రిషబ్ పంత్ పేరు పరిశీలనకు వచ్చినా.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రైనాను ఎంపిక చేశారు. రైనా టీ20 జట్టులోనూ సభ్యుడు. జట్టులో ధోని, దినేశ్ కార్తీక్ ఉండడంతో రిషబ్కు అవకాశం లేకుండాపోయింది.
ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతేడాది విఫలమైన సురేశ్ రైనా ఈసారి యో-యో ఫిట్నెట్ టెస్టులో విజయవంతమయ్యాడు. దీంతో రాయుడు స్థానం భర్తీపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అంబటి 600పైన పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆదివారం జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్శర్మకు యో యో పరీక్ష నిర్వహించనున్నారు.