

హైదరాబాద్: తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయానంటూ గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వస్తోన్న వార్తలను టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. కారు ప్రమాదంలో రైనాకు తీవ్ర గాయాలయ్యాయని కొందరు.. ఆ ఘటనలో చనిపోయాడని మరికొందరు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడంతో రైనా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తనకేం కాలేదనీ, తాను బతికే ఉన్నట్లు ట్విట్టర్లో స్పష్టం చేశాడు.
'గత రెండు, మూడు రోజులుగా నేను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇది నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను, శ్రేయోభిలాషులను తీవ్రంగా కలిచి వేసింది. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. ఆ దేవుడి దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. తప్పుడు వార్తలు సృష్టించిన వారిని గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని రైనా ట్వీట్ చేశాడు.