Suresh Raina: సంజూ శాంసన్ గాయపడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్గా ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీకి లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. వైభవ్ మొదటి బంతికే సిక్స్ కొట్టి ఆటను ప్రారంభించాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తన చిన్న ఇన్నింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వైభవ్ బ్యాటింగ్కు మంత్రముగ్ధుడయ్యాడు.
ఆర్సీబీపై వైభవ్ ఫియర్లెస్ బ్యాటింగ్ ను చూసిన సురేష్ రైనా ఒక పాట పాడటం ప్రారంభించాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే అని.. కానీ అతని స్వభావం, నిర్భయమైన శైలి, ఆటను అర్థం చేసుకోవడం, ప్రశాంతమైన శరీర భాష వైభవ్ అనుభవజ్ఞుడైన ఆటగాడని చూపిస్తాయని సురేష్ రైనా అన్నాడు. వైభవ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని.. ఎప్పుడూ భయపడడంటూ చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీతో మ్యాచ్ లో 12 బంతుల్లో 16 పరుగులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంసీ 12 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ 2 సిక్సర్లు కూడా కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని తమ జట్టులోకి రూ.1.1 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలిసిందే. ఈ విధంగా వైభవ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే..రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది కానీ చివరి ఓవర్లలో ఆ జట్టు పతనమైంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాన్ని సాధించింది.