న్యూఢిల్లీ: పెళ్ళి తర్వాత తన తొలి సెల్ఫీని క్రికెటర్ సురేష్ రైనా ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈసారి తన భార్యతో ఉన్న సెల్ఫీని ట్విట్టర్లో పెట్టాడు. తన బాల్య మిత్రురాలు ప్రియాంక చౌదరీని రైనా ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు రైనా కృతజ్ఞతలు చెప్పాడు.
వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుండటంతో దొరికిన కొద్దిపాటి సమయంలో రైనా యమ బిజీగా గడిపాడు. ఇంటికి వచ్చి పోయే బంధుమిత్రులను పలకరిస్తూ గడిపాడు. బంధుమిత్రుల ఆహ్వానాన్ని మన్నించి రైనా దంపతులు వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు.
ఈ క్రమంలోనే నూతన దంపతులు ఓ ఆలయానికి వెళ్ళిన సమయంలో అక్కడ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోనే రైనా ట్విట్టర్లో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని ఇటీవల వివాహమాడి బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికాడు. శుక్రవారం అర్ధరాత్రి ఓ సెవెన్ స్టార్ హోటల్లో రైనా వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వివాహానికి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీసమేతంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మరో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి వేడుకలో సందడి చేశాడు.
వివాహానికి హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, రైనా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్, ఐసిసి అధ్యక్షుడు శ్రీనివాసన్, చెన్నై ఆటగాడు డ్వెన్ బ్రావో, ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్, పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకున్నా, సందేశం ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ వేడుకలు ముగిశాక రైనా వెంటనే ఐపీఎల్తో బిజీ కానున్నాడు. నెలన్నర పాటు సాగే ఈ లీగ్ ముగిసిన తర్వాత రైనా దంపతులు హనీమూన్కు ఇటలీ వెళ్లనున్నారు.