ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్దఎత్తున చర్చ సాగిస్తున్నారు. జట్ల బలాబలాల గురించి వివరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్లో కొనసాగాలని రైనా అభిప్రాయపడ్డాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంచనాలను అందుకోలేదని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీ లోపాలు బహిర్గతమయ్యాయని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందుకు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే జట్టు పగ్గాలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే.

రుతురాజ్ సారథ్యంలో సీఎస్కే ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది. అయితే ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి ఆర్సీబీతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో చెన్నై పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి చాలా విషయాలను వివరించిందని రైనా పేర్కొన్నాడు.
''రుతురాజ్ గైక్వాడ్కు మరో ఏడాది అవసరమని భావిస్తున్నా. అతను కెప్టెన్గా వ్యవహరించిన విధానం, ఆర్సీబీ చేతిలో ఓటమితో చాలా విషయాలు తెలిశాయి. అయితే మొత్తంగా రుతురాజ్ సారథిగా గొప్పగానే బాధ్యతలు నిర్వర్తించాడు'' అని రైనా అన్నాడు. ఎంఎస్ ధోనీ గురించి రైనా మాట్లాడుతూ.. ''గత సీజన్లో ధోనీ బ్యాటింగ్ చేసిన విధానాన్ని చూస్తే... ఐపీఎల్ 2025లోనూ ధోనీ ఆడాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నాడు.
2024 సీజన్లో ధోనీ 11 ఇన్నింగ్స్ల్లో 161 పరుగులు చేశాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చి ధోనీ 220 స్ట్రైక్రేటు, 53 సగటుతో పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే రిటైన్డ్ ప్లేయర్ల నిబంధనలు ఖరారయ్యాక తన భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటానని ధోనీ పేర్కొన్న విషయం తెలిసిందే. జట్టుకు మేలు కలిగే నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పాడు.