హైదరాబాద్: నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కలిశాడు. తన భార్య ప్రియాంకతో కలిసి సురేశ్ రైనా నెదర్లాండ్స్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు.
అదే సమయంలో ప్రధాని మోడీ కూడా నెదర్లాండ్స్ పర్యనటకు రావడంతో రాజధాని అమస్టర్డాంలో రైనా దంపతులు ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి దిగిన ఫోటోని రైనా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
ప్రధాని మోడీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రైనా పేర్కొన్నాడు. సురేశ్ రైనా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వెస్టిండిస్ పర్యనటకు రైనాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో తనకు లభించిన సమయాన్ని రైనా కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.
భారత్ తరుపున 223 వన్డేలాడిన సురేశ్ రైనా 5568 పరుగులు చేశాడు. ఇక 65 టీ20ల్లో 1307 పరుగులు చేశాడు. ఐపీఎల్ పదో సీజన్లో కూడా రైనా అత్యంత నిలకడగా రాణించిన బ్యాట్స్మెన్గా అరుదైన గుర్తింపు పొందాడు. ఐపీఎల్ పది సీజన్లలో మొత్తం 161 టీ20 మ్యాచ్లాడిన రైనా 4540 పరుగులు నమోదు చేశాడు.