రాజ్కోట్: కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్(2008) నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్సవకుండా వరుసగా 143 మ్యాచ్లాడి అరుదైన రికార్డు సృష్టించిన టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా మొదటిసారి సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరమవనున్నాడు. విశ్రాంతి అవసరమయ్యో లేక గాయం కారణంగానో మ్యాచ్లకు దూరమవ్వట్లేదు రైనా.
ప్రస్తుతం గర్భిణిగా ఉన్న తన భార్య ప్రియాంక చౌదరి ప్రసవించే సమయంలో ఆమె చెంత ఉండేందుకు రైనా హాలాండ్ వెళ్తున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని నిరుడు రైనా వివాహమాడిన విషయం తెలిసిందే.
2008లో ఆరంభమైన ఐపీఎల్ తొలి సీజన్ నుంచి వరుసగా 143 మ్యాచ్లాడిన రైనా తన భీకర బ్యాటింగ్తో మొత్తం 3,985 పరుగులు చేశాడు. గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన రైనా.. చెన్నై జట్టు నిషేధానికి గురవడంతో కొత్తగా వచ్చిన గుజరాత్ లయన్స్ ఫ్రాంఛైజీ చేజిక్కించుకుంది.

అంతేగాక, రైనాకే నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సురేశ్ రైనా ఐపీఎల్-9లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన గుజరాత్ లయన్స్ ఏకంగా ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే 14న తలపడనున్న గుజరాత్ లయన్స్కు అరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు. కాగా, మే19న కోల్కతాతో జరిగే మ్యాచ్కు రైనా జట్టుతో కలుస్తాడని సమాచారం.