హైదరాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఘనంగా నిర్వహించారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడళ్లు త్రివర్ణ పతకాలతో రెపరెపలాడుతూ కనిపించాయి. కానీ.. కాశ్మీర్లోని లాల్ చౌక్లో మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని కాశ్మీర్లోని బక్షి స్టేడియంలో మాత్రమే అధికారికంగా వేడుకలను నిర్వహించారు. మరోవైపు కాశ్మీర్లోని ప్రధాన కూడళ్లు భద్రతా సిబ్బందితో నిండిపోయాయి. వేర్పాటువాదులను దృష్ట్యా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉన్నాయి.

అలాంటి పరిస్థితిలో ఓ మహిళ ఎంతో ధైర్యంగా బయటికి వచ్చి 'భారత్ మాతాకి జై' అంటూ నినాదాలు చేసి తన దేశభక్తిని చాటింది. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెటర్ సురేశ్ రైనా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'స్వాతంత్య్ర దినోత్సవం నాడు కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఓ మహిళ ఎంతో ధైర్యంగా బయటికి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే' అని రైనా పేర్కొన్నాడు. కాశ్మీర్లో ఉన్న పండిట్లు హిందూ మతానికి చెందినప్పటికీ మైనారిటీలుగా ఉన్నారు.
'భారత్ మాతాకి జై, వందే మాతరం, మీరూ భారత్కి చెందిన వారే కదా.. భారత్ మాతాకి జై చెప్పండి' అని ఆమె భద్రతా బలగాలను కోరుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.