రాహుల్ త్రిపాఠి, శిఖర్ ధావన్ పట్ల ఎందుకీ వివక్ష
అయితే బీసీసీఐ సెలెక్షన్లో కొన్ని అనూహ్య నిర్ణయాలు జరిగాయి. తప్పకుండా సెలెక్ట్ అవుతారని అనుకున్న సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, సీనియర్ ప్లేయర్ అయిన శిఖర్ ధావన్లను బీసీసీఐ పక్కన పెట్టింది. దీంతో ట్విట్టరులో అభిమానులు సైతం బీసీసీఐ సెలెక్షన్ పట్ల తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రాహుల త్రిపాఠి, ధావన్ ఏం తప్పు చేశారని వారిని తీసుకోలేదంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇకపోతే టీ20 జట్టులో ఇప్పటికే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు కావడంతో ఇక సంజూ శాంసన్ను చోటు ఇవ్వలేదని భావించడంలో కాస్త అర్థ పర్థం ఉంది. కానీ ఓపెనర్ గా రాణించిన శిఖర్ ధావన్, వన్ డౌన్లో ధాటిగా ఆడే రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది చాలా కఠిన నిర్ణయం
శిఖర్ ధావన్ను ఎంపిక చేయకపోవడం పట్ల భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన మాజీ సహచరుడిని టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఎప్పుడూ రన్స్ చేసే ధావన్ పట్ల ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమని రైనా అభిప్రాయపడ్డాడు. నిజానికి ఐపీఎల్ 2022లోనే.. ధావన్ 14మ్యాచ్లలో 460 పరుగులు చేశాడు. గత సీజన్లో 587మరియు, అంతకు ముందు సీజన్లో ధావన్ 618పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 జట్టు సెటప్లో ధావన్ పేరును పదే పదే సెలక్టర్లు విస్మరిస్తున్నారు.
టోర్నీ ఏదైనా రన్స్ చేసే ప్లేయర్ శిఖర్
'బీసీసీఐ తాజా నిర్ణయం పట్ల శిఖర్ ధావన్ నిరాశ చెందుతాడు. ప్రతి కెప్టెన్ జట్టులో ధావన్ లాంటి ఆటగాడు కావాలని కోరుకుంటాడు. అతను ఎంతో స్పోర్టివ్ పర్సన్, ఆటలో, ఆట వెలుపల సహచరులను ఉత్సాహపరిచే వ్యక్తి. అతను కన్సిస్టెన్సీగా పరుగులు చేశాడు. దేశీయ టోర్నీల్లోనైనా, అంతర్జాతీయ టోర్నీల్లోనైనా అతనో కన్సిస్టెన్సీ ప్లేయర్. ఫామ్ అందుకున్నాడని దినేష్ కార్తీక్ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చినప్పుడు శిఖర్ ధావన్ కూడా జట్టులో స్థానం పొందడానికి అర్హుడే కదా. అతను గత మూడు నాలుగేళ్లుగా వరుసగా మ్యాచ్లలో పరుగులు చేస్తున్నాడు. ఇంక అతనేం చేయాలో మరీ. అతను డీప్గా విచారపడుతూ ఉంటాడు.' అని క్రికెట్ లైవ్ షోలో రైనా అన్నాడు.
ఐపీఎల్లో ప్రతి సీజన్లో సగటున 500పరుగులు చేసే ప్లేయర్
2016 నుంచి శిఖర్ ధావన్ వివిధ ఫ్రాంచైజీల కోసం ఆడుతున్నప్పుడు తన క్లాస్ ఫర్ ఫార్మెన్స్ కొనసాగించాడు. ఐపీఎల్ ప్రతి ఎడిషన్లో కనీసం 500పరుగులు చేశాడు. 2021జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా ధావన్ చివరిసారిగా భారత్ తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ టీంకు అతను కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అతను టీమిండియా వన్డే టీంలో స్థిరమైన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో కూడా ఆకట్టుకునే గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ టీ20 సెటప్ నుంచి అతన్ని బీసీసీఐ తప్పించింది.