
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఈ సారి అనూహ్యంగా మెగా వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైనా రైనా ఈ సీజన్లో కనిపించడంలేదు. గతంలో కూడా ఓ సారి వ్యక్తిగత కారణాల దృష్యా రైనా ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే ఈ సీజన్ ఐపీఎల్లో కనిపించనప్పటికీ సురేష్ రైనా తన ఫిట్నెస్ కసరత్తులను మాత్రం మానడం లేదు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రైనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోలో రైనా సైక్లింగ్ చేయడం, జిమ్లో శ్రమించడం కనిపిస్తుంది. తీవ్రమైన వ్యాయామ సెషన్తో వారాన్ని ముగించడం కంటే మెరుగైనది ఏమి లేదంటూ దీనికి క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి ముందే చేసి ఉంటే బాగుండేదేమోనని కొందరు రాసుకొస్తున్నారు.
కాగా ఐపీఎల్ మెగా వేలంలో 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్తో బరిలోకి దిగిన సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయని సంగతి తెలిసింది. అతని పాత జట్టు చెన్నైసూపర్ కింగ్స్ కూడా రైనాను పట్టించుకోకపోవడం అభిమానులకు మింగుడు పడలేదని చెప్పుకోవాలి. ఐపీఎల్లో మొదటి నుంచి చెన్నైకే ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ రైనా ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.
మెగా వేలంలో సురేష్ రైనా అమ్ముడుపోకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సురేష్ రైనా ప్రస్తుతం అంతగా ఫామ్లో కూడా లేడు. గత ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. దీనికి తోడు మెగా వేలానికి ముందు 35 ఏళ్ల రైనా ఎలాంటి క్రికెట్ ఆడలేదు. తన ఫిట్నెస్ను కూడా నిరూపించుకోలేదు.
ఇవన్నీ కూడా మెగా వేలంలో సురేష్ రైనాకు మైనస్గా మారాయని చెప్పుకోవాలి. ఈ కారణంతోనే అతన్ని కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి కనబరచలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వర్కౌట్ సెషన్లు మెగా వేలానికి కంటే ముందు చేసి ఉంటే బాగుండేదని రాసుకొస్తున్నారు.