న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో సురేష్ రైనా అడుగుపెట్టి గురువారం నాటికి దశాబ్ద కాలం పూర్తయింది. సురేష్ రైనా 2005, జులై 30న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
తొలి మ్యాచ్లో మొదటి బాల్కే ఔటై నిరాశ పరచిన రైనా ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. అనేక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. ఇప్పటి వరకు 218 వన్డే మ్యాచులాడిన రైనా.. 5,500 పరుగులు చేశాడు.
5 వన్డే శతకాలు, 35 అర్ధ శతకాలు సాధించాడు. బ్యాట్స్ మెన్గానే కాకుండా బౌలర్గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు రైనా. ఐసిసి క్రికెటర్ ర్యాంకింగ్స్లో బ్యాట్స్మెన్గా ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్నాడు. కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 10వ స్థానం సంపాదించుకున్నాడు.

సురేష్ రైనా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి 26, జులై 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచుతో ఆరంగేట్రం చేశాడు. 18 టెస్ట్ మ్యాచులాడిన రైనా.. 768 పరుగులు చేశాడు. ఒక శతకం, 7 అర్థ శతకాలు నమోదు చేశాడు. 44 టి20 మ్యాచులాడిన రైనా.. 947 పరుగులు చేశాడు.
సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ట్రెండింగ్స్లో 'రైనా10' భారత్లో అగ్రస్థానంలో కొనసాగడం భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా సురేష్ రైనా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. మీ ఆశీస్సుల వల్లే తాను పదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ను విజయవంతంగా పూర్తి చేశానని పేర్కొన్నాడు.