
హైదరాబాద్: ఎఫ్పుడెప్పుడు ఆడదామనే కుతూహలంతో క్రికెటర్లు తమ తమ అభిమాన జట్టు ఎలా ఆడుతుందో అనే ఆరాటంలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే యో యో పరీక్షలో పాసై టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తోన్న ఆటగాడు సురేశ్ రైనా. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో పరుగులు సాధించలేదన్న కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు.
రైనా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో ఆడుతున్నాడు. ఐపీఎల్-11వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తన వద్ద అట్టిపెట్టుకున్న ముగ్గురు ఆటగాళ్లలో రైనా ఒకడు కావడం విశేషం. అంతేకాదు రైనానే ఆ జట్టకు వైస్ కెప్టెన్ కూడా. అంటే ధోనీ తర్వాత రైనానే ఆ జట్టుని నడిపించాలి. తాజాగా రైనా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.
'రెండేళ్ల తర్వాత తిరిగి ధోనీ నాయకత్వంలో ఆడటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరోసారి సభ్యుడిని కావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. చెన్నైలో చాలా మ్యాచ్లు ఆడాం. కొన్ని గెలిచాం.. కొన్ని ఓడాం. ఒక లీగ్లో అయితే ఫైనల్ వరకు వెళ్లి అక్కడు ఓడాం. అయినా అక్కడి ప్రజల నుంచి వచ్చే మద్దతు ఎప్పటికీ మరిచిపోలేం.' అంటూ చెన్నై వాసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇంకా మాట్లాడుతూ 'ఐపీఎల్తో పాటు దేశవాళీ మ్యాచ్లు అన్నింట్లో ఆడేలా ఈ ఏడాది ప్రణాళిక వేసుకున్నా. ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటూ ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వను. ఐపీఎల్ టోర్నీలో ధోనీనే బెస్ట్ కెప్టెన్. అతని సారథ్యంలో ఆడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. త్వరలో ధోనీ, నేను, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, కోచ్ ఫ్లెమ్మింగ్ అందరం కలుస్తాం. ఈ నెల ఆఖరి వారంలో జరిగే ఆటగాళ్ల వేలం గురించి ప్రధానంగా చర్చిస్తాం' అని రైనా వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రైనా(4540) ముందున్నాడు. ఆ తర్వాత 122 పరుగుల తేడాతో విరాట్ కోహ్లీ(4418) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఎవరి ఏ స్థానాల్లో నిలుస్తారో తెలుసుకోవాలంటే మరో నాలుగు నెలలు వేచి ఉండాల్సిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.