ప్రియాంకకు తోడుగా రైనా:
కొరోనా మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13 ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. దీంతో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ను పక్కనపెట్టి ఇంటికి పయమయ్యారు. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా చెన్నైను వీడి తన ఇంటికి చేరుకున్నారు. ప్రియాంకకు డెలివరీ సమయం దగ్గర పడడంతో ఆమెనే చూసుకుంటూ ఇంటి వద్ద సరదా సమయం గడిపాడు.
రైనా ఆశలకు కరోనా గండి:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
ఆమె రాకతో నా జీవితమంతా మారిపోయింది:
రైనా తన 4 సంవత్సరాల కుమార్తె గురించి ఇటీవల బాగా మాట్లాడాడు. 'నా కుమార్తె నాకు పెద్ద మద్దతుదారు. ఆమె రాకతో నా జీవితమంతా మారిపోయింది. నేను ఆమెతో పంచుకునే చిన్న చిన్న క్షణాలు చాలా విలువైనవి. తొలి రోజు నుండి నా కూతురు నా పక్షాన ఉంది. ఆమె నా ట్రావెల్, జిమ్ బడ్డీ. నా భార్య, నేను ఎక్కడికివెళ్ళినా మాతో పాటే వస్తుంటుంది' అని రైనా కుమార్తె గురించి చెపుతూ సంబరపడిపోయాడు.
|
18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో తరచుగా మ్యాచ్లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు.