Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెటర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుభవజ్ఞులు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉండగా.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో విరాట్ కోహ్లీని సత్కరించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా డిమాండ్ చేశాడు.
విరాట్కు భారతరత్న ఇవ్వాలి..
విరాట్ కోహ్లీకి భారతరత్న ఇవ్వాలని సురేష్ రైనా డిమాండ్ చేశాడు. విరాట్ కోహ్లీ దేశం కోసం చాలా చేశాడని రైనా తెలిపాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రైనా ఈ డిమాండ్ చేశాడు. భారత క్రికెట్కు ఎనలేని సేవలకు గుర్తుగా కోహ్లీని భారతరత్నతో సత్కరించాలని రైనా విజ్ఞప్తి చేశాడు. విశ్వవేదికపై విరాట్ కోహ్లీ ఎన్నో అసాధారణ ఘనతలను సాధించాడని.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని రైనా వెల్లడించాడు. ఆ అవార్డుకు విరాట్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నాడు. అయితే 2014లో భారతరత్న అవార్డును అందుకున్న ఏకైక భారతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కావడం గమనార్హం.

14 ఏళ్ల కెరీర్కు ముగింపు పలికిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే తన 14 ఏల్ల టెస్ట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు ముగింపు పలుకుతున్నట్లు రన్ మెషీన్ స్వయంగా ఇన్స్టా పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ను 2011లో ప్రారంభించి భారత్ తరఫు 123 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 31 అర్ధ సెంచరీలు, 30 సెంచరీలు కూడా సాధించాడు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 68 మ్యాచ్ల్లో ఇండియాకు నాయకత్వం వహించాడు. వాటిలో 40 మ్యాచ్ ల్లో ఇండియా గెలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుందగి. భారత్ 42 నెలలు ఈ స్థానంలో కొనసాగింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. కానీ కోహ్లీ వన్డేలు ఆడటం కొనసాగిస్తాడు. విరాట్ 2027 ప్రపంచ కప్లో ఆడతాడని భావిస్తున్నారు.