హైదరాబాద్: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కి శుక్రవారం సుప్రీం కోర్టు షాకిచ్చింది. తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేసినందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పిన క్షమాపణను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
సుప్రీం తీర్పు ఎఫెక్ట్: చేతులు కలిపిన శ్రీని, ఠాకూర్
వివరాల్లోకి వెళితే... జస్టిసన్ లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలు కోసం బీసీసీఐలో కాగ్కి చెందిన వ్యక్తిని సుప్రీంకోర్టు నియమించడం ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా? అని అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాశారు.
ఈ విషయం బయటికి రావడంతో ఐసీసీకి లేఖ రాశారా..? అని అనురాగ్ ఠాకూర్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు అనురాగ్ ఠాకూర్ లేదని చెబుతూ తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. దీనిపై ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ని ప్రశ్నించగా.. బీసీసీఐ లేఖ రాసింది వాస్తమేనని అయితే ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సుప్రీంకోర్టుకి ఆయన సమాధానమిచ్చారు.
దీంతో తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో పాటు బీసీసీఐలో జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను అమలు చేసేందుకు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహించిన సుప్రీం కోర్టు బోర్డు అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్ని తప్పించింది.
ఆ తర్వాత నలుగురు సభ్యులతో పరిపాలక కమిటీని నియమించి బీసీసీఐ బాధ్యతలను వారికి అప్పగించింది. ఈ తతంగం అంతా జరిగిన తర్వాత 'కోర్టును మోసగించాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేయలేదని' అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు.
అసత్య ప్రమాణం కేసు: సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఠాకూర్
అయితే అనురాగ్ ఠాకూర్ చెప్పిన క్షమాపణపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.ఎమ్.ఖాన్విల్కర్, జస్టిస్ డీ.వై చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య బెంచ్ సంతృప్తి వ్యక్తం చేయక పోగా మరోసారి కొత్తగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి వాయిదాను శుక్రవారానికి వేసింది.