న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై నమోదైన క్రిమినల్ కేసు విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టేసింది. ఓ మ్యాగజైన్ కవర్ పేజిలో విష్ణుమూర్తి రూపంలో ధోనీ ఫొటోను ప్రచురించి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో ఈ కేసు నమోదైంది.
కర్ణాటక హైకోర్టు ధోనిని విచారణకు పిలిపించడంలో చట్టపరమైన విధానాలను అవలంబించలేదన్న కారణంతో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాదు నిందితుడిని విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు మొత్తం విచారణనే కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజాగా ధోనిపై క్రిమినల్ విచారణను ఆపేందుకు నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఇప్పుడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే... గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన ధోనిపై క్రిమినల్ విచారణపై సుప్రీం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఓ మ్యాగజైన కవర్పై ధోనీ విష్ణుమూర్తి అవతారంలో చేతిలో బూట్లతో కనిపించడాని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ్ కేసు పెట్టారు. దీనిపై అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధోనీపై 295, 34 సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిందిగా ఆదేశించారు.
ఆ తర్వాత కోర్టులో హాజరు కావాలని ధోనికి సమన్లు పంపారు. ఈ సమన్లుపై ధోని హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ధోనిపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ ధోనీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.