హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ధోనిపై దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటీషన్ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే 2013, ఏప్రిల్లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. ఇందులో ధోని చేతుల్లో తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్ను కూడా ఉంచారు.
దీంతో ఈ ఫోటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూలో అప్పట్లో జయకుమార్ హీరామత్ అనే సామాజిక ఉద్యమకర్త ధోనిపై కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది.
ఈ ఫోటో వివాదంలో ధోని ప్రమేయం లేదని కేసును కొట్టివేయాల్సిందిగా ధోని తరుపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. ధోని ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.