న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ప్రదానం చేసిన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వెనక్కి తీసుకోవాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
సచిన్ను భారతరత్నగా కీర్తిస్తూ కొందరు రచయితలు పుస్తకాలు రాశారని, సచిన్ కూడా అలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని నస్వా ఆరోపించారు. ఈ క్రమంలో భారతరత్నను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ నియమాలు లేవని పేర్కొంది.

'కొందరు ఇతర వ్యక్తులు మాజీ క్రికెటర్ సచిన్పై పుస్తకం రాసి భారతరత్న అని పేరు పెట్టుకున్నారు. అయితే దీనికి సచిన్ను బాధ్యులను చేయడం సబబు కాదు' అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది.