న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సుప్రీం కోర్టు తుది వార్నింగ్ ఇచ్చింది. బీసీసీఐ ప్రక్షాళన కోసం గాను జస్టిస్ లోథా కమిటీ సూచించిన అన్ని సంస్కరణలనూ తూచ తప్పకుండా అమలు చేయాలని గురువారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బీసీసీఐ ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
లోథా కమిటీ ప్రతిపాదనలను 24 గంటల్లోగా అమలు చేయకుంటే, శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అర్హతపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఒకే ఒక్క రంజీ మ్యాచ్ ఆడిన అతడు బీసీసీఐ అధ్యకుడా అని ఆక్షేపించింది.

ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా? అని ప్రశ్నించింది. తాము క్రికెటర్లమేనని, న్యాయమూర్తుల జట్టుకు తాను కెప్టెన్ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ తీరును సర్వోన్నత న్యాయస్థానికి అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం నివేదించారు. డబ్బు పంపిణీ చేయొద్దని జస్టిస్ లోధా కమిటీ చెప్పినా బీసీసీఐ పట్టించుకోలేదని తెలిపారు.
అనుబంధ సంఘాలకు రూ. 400 కోట్లు పంపిణీ చేసిందని వెల్లడించారు. లోధా కమిటీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించేందుకే ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాగా, 24 గంటల్లో లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయలేమని కోర్టుకు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు గురువారం లోధా కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం బీసీసీఐ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
దీనిపై బీసీసీఐ వైఖరి సరైనది కాదంటూ పేర్కొంది. "మా సమయం వృథా చేయకండి. లోథా కమిటీ సూచనలను అమలు చేస్తామని చెప్పండి. లేదంటే బోర్డుని రద్దు చేస్తామని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది" అంటూ బీసీసీఐని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీనికి సమాధానంగా అక్టోబర్ 7న తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని సుప్రీంకు బీసీసీఐ తెలిపింది.
ఇదే సమయంలో బీసీసీఐకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి అంగీకరించని క్రికెట్ సంఘాలకు నిధులను విడుదల చేయవద్దని సూచించింది. బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది.
హడావుడిగా నిధులను పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐని ప్రశ్నించింది. బోర్డులో పారదర్శకత ఉంటే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ సుప్రీం ప్రశ్నించింది. "మీరు లార్డ్స్ లా ప్రవర్తిస్తున్నారు. దారిలోకి వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మేమే మిమ్మల్ని దారిలో పెట్టాల్సి ఉంటుంది" అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం బీసీసీఐని హెచ్చరించింది.