హైదరాబాద్: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, మాజీ కార్యదర్శి నిరంజన్షాలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. జులై 26న జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరు కావొద్దని జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖన్విలికర్, జస్టిస్ చంద్రచూడ్ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
అయితే ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెందిన ఆఫీసు బేరర్లు మాత్రం ఏజీఎంకు హాజరుకావొచ్చని కోర్టు సూచించింది. జస్టిస్ లోధా నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు క్రికెట్ సంఘం నుంచి శ్రీనివాసన్, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తరఫున నిరంజన్ షాలు గత కొన్నినెలలుగా బీసీసీఐ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో వీళ్లిద్దరినీ బోర్డు సమావేశాలకు దూరంగా ఉండాలంటూ జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ సోమవారం ఆదేశించింది. లోధా సూచించిన ప్రతిపాదనల ప్రకారం 70 ఏళ్లు పైబడడంతో శ్రీనివాసన్, నిరంజన్ షాలు ఎలాంటి క్రికెట్ పదవుల్లో కొనసాగేందుకు అర్హులు కారు.
అయినా కూడా వీళ్లు తమ రాష్ట్ర క్రికెట్ సంఘాల తరఫున బోర్డు సమావేశాలకు హాజరవుతుండడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇక, చాలా రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్న ఒక రాష్ట్రం, ఒక ఓటు ప్రతిపాదనపై పునరాలోచన జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. జాతీయ సెలెక్షన్ కమిటీ విస్తరణ వంటి అంశాలను పరిశీలించేందుకు అంగీకరించింది.
పలు రాష్ట్రాల్లో రెండేసి క్రికెట్ సంఘాలు ఉండటంతో పాటు వాటికి ఓటింగ్ హక్కు కూడా ఉండేది. లోధా కమిటీ కొత్త సంస్కరణ అమల్లోకి వస్తే ఓ రాష్ట్రానికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రమంటూ లేని రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీలకు ఉన్న ఓటింగ్ హక్కు కూడా కోల్పోవాల్సి ఉంటుంది.
దీంతో దీనిపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 'ఒక ఓటు-ఒక రాష్ట్రం ప్రతిపాదన ఈ దేశానికి మంచిది కాదనిపిస్తోంది. రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీ, మహారాష్ట్ర, బరోడా క్రికెట్ సంఘాలకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్ విచారణలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం' అని జస్టిస్ ఖన్విల్కర్, చంద్రచూడ్లతో కూడిన బెంచ్ పేర్కొంది.
ఈ వ్యాఖ్య లోధా కమిటీ సిఫారసుకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. కోర్టు తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. మొత్తంగా ఇప్పటివరకూ లోధా కమిటీ సిఫారసులను యధాతథంగా అమలు చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఒకింత పట్టు సడలించడంతో సంస్కరణల అమలుకు మార్గం సుగమం అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.