టీమిండియా బ్యాట్స్మన్, హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్బై చెబుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీలు లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్ తదితరులు రాయుడు రిటైర్మెంట్పై స్పందించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'రాయుడు నువ్ ఎప్పుడూ సూపర్ టాలెంటెడ్ చాంపియన్. సెలెక్టర్లు పట్టించుకోకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ నిన్ను ఎప్పటికీ మరచిపోరు. నీ సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలి' అని కేటీఆర్ ఆకాంక్షించారు.
You will always remain a super talented champ @RayuduAmbati 👍
— KTR (@KTRTRS) July 3, 2019
Selectors may have snubbed you but Indian cricket lovers will remember your brilliance for a long time. Good luck in your second innings
ప్రపంచకప్ జట్టు ఎంపికలో మొదటి నుంచీ స్థానం ఆశించిన రాయుడుని కాదని సెలెక్టర్లు విజయ్ శంకర్ని ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ అందుకు వివరణ ఇచ్చిన తర్వాత రాయుడిని రెండో స్టాండ్బై ఆటగాడిగా ప్రకటించారు. తొలుత శిఖర్ ధావన్ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్ పంత్ను ఎంపిక చేశారు. అనంతరం విజయ్ శంకర్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. అతడి స్థానంలో యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండోసారీ కూడా రాయుడికి నిరాశే ఎదురైంది. ఇక అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడని తెలుస్తోంది.
అయితే సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక రాయుడు చేసిన ట్వీటే కారణమని అంతా భావిస్తున్నారు. తొలిసారి ప్రపంచకప్ జట్టుని ఎంపిక చేసినప్పుడు తనని కాదని విజయ్ శంకర్ని ఎంపిక చేయడం పట్ల రాయుడు వివాదాస్పద ట్వీట్ (3డి గ్లాస్ ట్వీట్) చేసిన విషయం తెలిసిందే.