అహ్మదాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గిన రాజస్థాన్ మూడో మ్యాచ్లోనూ విజయ బావుటా ఎగురవేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో 79 నాటౌట్) చెలరేగడంతో మొతేరా మైదానంలో మంగళవారం జరిగిన పోరులో ముంబైపై ఏడు వికెట్ల తేడాతో సునాయసమైన విజయం సాధించింది.
ముంబై నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదిందించింది. స్మిత్తో పాటు రహానె (46) రాణించాడు. ముంబై బౌలర్లలో వినయ్, మలింగ, గోపాల్ తలో వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 70), కోరె ఆండర్సన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) దూకుడు ప్రదర్శించిండతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌటయ్యాడు. స్మిత్కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

రహనే, సంజూ శాంసన్ రాయల్స్కు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే శాంసన్ (17)ను ఐదో ఓవర్లో వినయ్ అవుట్ చేశాడు. స్మిత్తో కలిసి రహానె ఛేదన కొనసాగించాడు. అయితే రహనే 14వ ఓవర్లో గోపాల్కే వికెట్ ఇచ్చుకున్నాడు. ఇక తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులనూ స్టాండ్స్లోకి పంపిన దీపక్ హుడా (13)ను మలింగ ఫుల్ బంతితో బోల్తా కొట్టించాడు.
కానీ, మరో వైపు నుంచి స్మిత్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో సాధించాల్సిన రన్రేట్ తగ్గిపోతూ వచ్చింది. మలింగ వేసిన 17వ ఓవర్లో మూడు బౌండ్రీలు బాదిన స్మిత్ ఆ తర్వాత మరింత వేగం పెంచి రాయల్స్ను గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్కోరు పెంచడానికి ముప్పు తిప్పలు పడింది. రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా వెనుదిరగగా, నాలుగో ఓవర్లో ఓపెనర్ ఫించ్ రిటైర్డ్ హర్టయ్యాడు. సింగిల్ తీసే ప్రయత్నంలో మోకాలు పట్టేసింది. తర్వాతి ఓవర్లోనే పార్థీవ్ (16)ను కులకర్ణి, రోహిత్ను బిన్నీ అవుట్ చేశారు. ఆ వెంటనే ఉన్ముక్త్ను తాంబే బౌల్డ్ చేశాడు.