సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్కు చేరింది. ఢిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సన్రైజర్స్ అంచనాలను అందుకుంటూ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. న్యూలాండ్స్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ (63; 45 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (21; 19 బంతుల్లో) కలిసి మలన్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వీరిద్దరు పవర్ప్లేలో కలిసి 45 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత డర్బన్ బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు తీశారు.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ (30; 23 బంతుల్లో)తో కలిసి మలన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే డర్బన్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. సన్రైజర్స్కు అవకాశం ఇవ్వకుండా స్కోరును కట్టడిచేశారు.
అనంతరం ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. బార్ట్మన్, మార్కో జేన్సన్ ధాటికి డర్బన్ బ్యాటర్లు విలవిలలాడారు. వియాన్ మల్డర్ (38; 34 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ (23; 15 బంతుల్లో), క్వింటన్ డికాక్ (20; 23 బంతుల్లో) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో బార్ట్మన్ నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జేన్సన్ 3.3 ఓవర్లలో 16 పరుగులిచ్చి మరో నాలుగు వికెట్లు సాధించాడు. బార్ట్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
కాగా, ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఇవాళ జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో పార్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ పోరులో విజేతతో గురువారం క్వాలిఫయర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడనుంది. అనంతరం క్వాలిఫయిర్-2 విజేతతో సన్రైజర్స్ టైటిల్ కోసం అమీతుమి తేల్చుకుంటుంది.