SRH VS KKR: సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్లోనూ 300 స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించడం పరిపాటిగా మారింది. కానీ, ఆ జట్టు గత రెండు మ్యాచుల్లో కనీసం 200+ స్కోరును కూడా చేయలేక విఫలమైంది. జట్టులోని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఇంకా ఆశించదగ్గ మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో హైదరాబాద్ జట్టు మ్యాచుకు సిద్ధమైన వేళ.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు.
గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో రన్నరప్ గా నిలిచిన సన్రైజర్స్ ఈ ఏడాది కూడా అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు నితీశ్ కుమార్. ఆ సత్తా తమ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. జట్టు స్వేచ్ఛగా ఆడటం, పవర్ప్లేలో ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ఇన్నింగ్స్ మొత్తం నిలకడగా, దూకుడుగా ప్రదర్శన చేయడం వంటి అంశాల గురించి మాట్లాడాడు నితీశ్. జట్టు విజయంలో ప్రతి ఆటగాడి పాత్ర కీలకమని, అందరి సహకారం అవసరమని చెప్పుకొచ్చాడు.

అదే రిపీట్ చేస్తాం..
"నా జట్టు బలంగా ఉంది. గత సీజన్ ను అద్భుతంగా ముగించాం. అదే విజయాన్ని మరోసారి రిపీట్ చేస్తాం. మా వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఆటను స్వేచ్ఛగా ఆడటం, పవర్ప్లేలో ఎక్కువ పరుగులు చేయడం, ఆ ఉత్సాహాన్ని చివరి ఓవర్ల వరకు కొనసాగించడం. టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్.. ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. ఈ సీజన్ కూడా అద్భుతంగా ముగిస్తాం అని మేం ఆశిస్తున్నాం" అని నితీశ్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు.
అతడి బౌలింగ్లో ఆడటం..
తాను బౌలర్లను మరింత మెరుగ్గా అర్థచేసుకోవడం ప్రారంభించినట్లు తెలిపాడు నితీశ్ కుమార్. "ఇప్పుడు నేను బౌలర్లను మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటున్నాను. వారు నా ఆటను విశ్లేషించినట్లుగానే, నేనూ వారి ఆటను పరిశీలిస్తున్నాను. నా ప్రధాన వ్యూహం అదే. కానీ అవసరమైనప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటాను. గత సీజన్ లో నేను మొదటి నాలుగు మ్యాచ్లు ఆడలేదు. కానీ ఆ తర్వాత నేను మ్యాచ్ బరిలోకి దిగాక కగిసో రబాడాను ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో, ఆ పిచ్పై అతడు చాలా దూకుడాగా బౌలింగ్ చేశాడు. ఆ పరిస్థితిలో అతడిని ఎదుర్కోవడం ఓ సవాల్గా మారింది" అని నితీశ్ అన్నాడు.