హైదరాబాద్: ఈ సీజన్లో ఇప్పటివరకు ధోని ఆడిన మ్యాచ్ల్లో తక్కువ పరుగులు చేసినప్పటికీ అతడిని తక్కువగా అంచనా వేయలేమని సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా శనివారం పూణె వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వీవీఎస్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడాడు. 'ధోనిలో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. ఐదు మ్యాచ్ల్లో కేవలం 61 పరుగులే సాధించాడు. అంతమాత్రానా ధోనీని తక్కువ అంచనా వేయలేం. మా మదిలో అలాంటి ఆలోచననే రానివ్వం. అతను ఏ క్షణానైనా పుంజు కోవచ్చు. అతనో మ్యాచ్ విన్నర్' అని అన్నాడు.

ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. ఈ సీజన్లో కొత్త ఆటగాళ్లతో తమ జట్టు మరింత పటిష్టంగా తయారైందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే పూణెలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో చివరి వరకు విజయం దోబూచులాడింది. ఈ సీజన్లో తనపై చేస్తున్న విమర్శకులకు ధోని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో పూణె ఆటగాడు ధోని ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ధోని 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు.
177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహానే (2) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, త్రిపాఠితో కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. సిరాజ్ వేసిన 5 ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్ను బిపుల్ శర్మ మిస్ చేశాడు.
దీనిని ఆసరాగా చేసుకుని త్రిపాఠి సిరాజ్ బౌలింగ్లో సిక్స్, ఫోర్తో చెలరేగాడు. ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు రాబట్టాడు. ఇలా 32 బంతుల్లో త్రిపాఠి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 11 ఓవర్లో తన అద్భుతమైన బంతితో స్మిత్ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో వీరద్దరి 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఆచి తూచి ఆడాడు. ఈ సమయంలో 14 ఓవర్లలో త్రిపాఠి (59) పరుగుల వద్ద రషీద్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. చివర్లో సిరాజ్ వేసిన 18 ఓవర్లో ధోని వరుస బంతుల్లో సిక్సర్, ఫోర్తో రాణించడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.
భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పూణె విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి బంతిని ధోని ఫోర్ బాదడంతో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.