
ఐపీఎల్ కొత్త సీజన్కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాది కొత్తగా కనిపించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తదితర జట్లన్నీ తమ కొత్త జెర్సీలను విడుదల చేశాయి. ఇప్పుడు తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ జాబితాలో చేరింది. గతేడాది ఉన్న జెర్సీల స్థానంలో స్టైలిష్గా ఉండే కొత్త జెర్సీలను సన్రైజర్స్ తీసుకొచ్చింది.
సన్రైజర్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ క్యాంపెయిన్ను ఏప్రిల్ 2న మొదలు పెడుతుంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ స్టార్లు ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్తో ఒక ప్రోమో వీడియో షూట్ చేసింది. ఈ వీడియోతో తమ కొత్త జెర్సీని విడుదల చేసిందీ ఫ్రాంచైజీ. 'కూల్, ఫన్, ఫీరీ' అనే క్యాప్షన్తో కొత్త జెర్సీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్కు కూడా ఈ కొత్త జెర్సీ తెగ నచ్చేసిందట.
కాగా, ఈ ఏడాది సన్రైజర్స్ కొత్త కెప్టెన్ సారధ్యంలో బరిలో దిగనుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును టైటిల్ విన్నర్గా నిలిపిన ఎయిడెన్ మార్క్రమ్కు జట్టు పగ్గాలను ఫ్రాంచైజీ యాజమాన్యం అప్పగించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో 12 మ్యాచులు ఆడిన మార్క్రమ్.. ఒక సెంచరీ సహా 366 పరుగులు చేశాడు. బౌలింగ్లో కూడా అడపా దడపా రాణించాడు.
అయితే గతేడాది ఈ జట్టుకు కెప్టెన్సీ చేసిన కేన్ విలియమ్సన్ను మినీ వేలానికి ముందే సన్రైజర్స రిలీజ్ చేసేసిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు పగ్గాలు ఎవరికి అప్పచెప్తారనే చర్చ కొంతకాలం నడిచింది. దీనికి బదులిచ్చిన సన్రైజర్స్ యాజమాన్యం ఎయిడెన్ మార్క్రమ్కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించింది.