
హైదరాబాద్: చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని సన్రైజర్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 143/9కే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేసినా.. మిడిలార్డర్ పూర్తిగా ముంచడంతో సన్రైజర్స్కు సీజన్లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు. అయితే మనీశ్ పాండే పరుగులు చేసిన చాలాసార్లు సన్రైజర్స్కు ఓటమితప్పట్లేదు.
మనీష్ పాండే.. 30 బంతులకు పైగా ఆడిన మ్యాచులలో సన్రైజర్స్ హైదరాబాద్ దాదాపు ఓడిపోయింది. 2018 నుంచి మనీష్ 30 బంతులకు పైగా 14 మ్యాచులు ఆడగా.. 11 సార్లు సన్రైజర్స్ ఓటమిపాలైంది. గత నాలుగు సీజన్లుగా మనీష్ ఆట సన్రైజర్స్కు ఏమాత్రం కలిసిరావడం లేదు. బెంగళూరుపై 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. బౌండరీల ద్వారానే అతడు 20 రన్స్ చేశాడు. అంటే.. మ్యాచులో మనీష్ డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. కోల్కతాపై కూడా నెమ్మదిగా ఆడి జట్టు ఓటమికి కారణమయ్యాడు.
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఓ లీగ్ మ్యాచ్లో మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగాడు. ఈ మధ్య కాలంలో మనీష్ ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ అంటే అదొక్కటే అనే చెప్పొచ్చు. రాయల్స్పై చెలరేగి ఆరేళ్ల తరువాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. దాంతో స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, సురేష్ రైనాల సరసన మనీష్ చేరాడు. భారత ఆటగాళ్లు అయిన మనీష్, రోహిత్, రైనాలు.. భారత్, దక్షిణాఫ్రికా, యూఏఈలో జరిగిన ఐపీఎల్లలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్కు మనీష్ పాండే కలిసిరాకపోయినా.. టీమిండియా మాత్రం బాగానే కలిసొచ్చాడు. ఓ సమయంలో టీమిండియాకు మనీష్ 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర పడింది. ఇదివరకు టీ20 జట్టులో పాండేకి చోటిచ్చిన ప్రతిసారీ టీమిండియానే గెలుపొందింది. 2018 నుంచి 2020 ఫిబ్రవరి వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ 18 టీ20 మ్యాచ్లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ లెక్కలు చూస్తే.. టీమిండియాకు పాండే 'గోల్డెన్ లెగ్' అనొచ్చు. భారత్ తరఫున 39 టీ20లు ఆడి 709 పరుగులు చేశాడు.