
వార్నర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ టైటిల్:
వార్నర్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. ఓడిపోయే మ్యాచులను కూడా డేవిడ్ భాయ్ ఒంటిచేత్తో గెలిపించాడు. అద్భుత ఓపెనింగ్ ఇచ్చి ఎన్నోసార్లు భారీ స్కోర్లు అందించారు. పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా.. జట్టులో మంచి సమతూకం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించాడు. 2012లో డెక్కన్ చార్జర్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్ సామి, శిఖర్ ధావన్, కామెరున్ వైట్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో వార్నర్ ఆ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసిన తర్వాత సన్రైజర్స్ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ టైటిల్ను సన్రైజర్స్ అందుకుంది. ఆ సీజన్లో వార్నర్ బ్యాటింగ్లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్ను అందించాడు. అప్పటినుంచి 2018 సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్గా పనిచేసిన వార్నర్ ప్రతీసారి ఫ్లేఆఫ్కు తీసుకురావడం విశేషం. అందుకే వార్నర్ ఎస్ఆర్హెచ్ బృందంకు అతిపెద్ద ఆస్తిఅయ్యాడు.

2018 సీజన్కు దూరం:
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్.. 2018 ఐపీఎల్ సీజన్కు దూరం అయ్యాడు. దాంతో అతని స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్గా పనిచేశాడు. ఆ ఏడాది విలియమ్సన్ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఎస్ఆర్హెచ్ ఫైనల్కు వచ్చింది. అయితే ఫైనల్లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. 2019లో ఆటగాడిగా దుమ్మురేపాడు. యూఏఈ వేదికగా జరిగిన 2020 సీజన్లోనూ రాణించాడు. 2016 నుంచి అతను ఆడిన ప్రతీ సీజన్లో 500కు పైగా పరుగులు చేశాడు. లీగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా అరుదైన రికార్డును అందుకున్నాడు.

2021లో మాత్రమే:
2014లో 14 మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్ 140 స్ట్రైక్ రేటుతో 528 పరుగులు సాధించాడు. అలాగే 2015లో 156 స్ట్రైక్ రేట్తో 562 పరుగులు చేశాడు. 2016లో 17 మ్యాచులు ఆడిన వార్నర్ 151 సగటుతో 848 పరుగులు చేశాడు. అలానే 2020 వరకు 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తూ వచ్చాడు. కానీ 2021లో మాత్రం ఫాంలో లేక తంటాలు పడ్డాడు. వార్నర్ ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్తో 195 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే.. 2021లోనే అతి తక్కువ పరుగులు సాధించాడు. అయితే ప్రతీ ఆటగాడికి ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మాత్రం అతడి పట్ల కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఆపై ప్లేయింగ్ ఎలెవన్లో కూడా చోటివ్వలేదు. తొలి దశలో ఓ మ్యాచులో వార్నర్ ఆడలేదు. అప్పుడు ఆట మధ్యలో ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకువెళ్లాడు.

మళ్లీ స్టేడియంలోకి రాను:
రెండో దశలో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచులు ఆడగా.. రెండింటిలో డేవిడ్ వార్నర్ ఆడలేదు. వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్లో లేకపోవడంతో హోటల్లోనే గడిపినట్లు తెలుస్తుంది. కనీసం డగౌట్లో (డగౌట్లో ఉండేందుకు జట్టులోని 18 మందికి స్థానం ఉంటుంది) కూడా ఎక్కడా కనిపించలేదు. సన్రైజర్స్ మేనేజ్మెంట్, వార్నర్కు మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. ఏదేమైనా ఎస్ఆర్హెచ్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వార్నర్ చేసిన ఓ ట్వీట్ కూడా అభిమానులను షాక్కు గురిచేసింది. 'దురదృష్టవశాత్తు నేను మళ్లీ స్టేడియంలోకి రాను. కానీ సన్రైజర్స్ జట్టుకు మద్దతు మాత్రం ఇస్తూనే ఉండండి' అని వార్నర్ పేర్కొవడం పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో సన్రైజర్స్ నుంచి తప్పుకుని వేరే ప్రాంచైజీకి వెళ్తానని వార్నర్ చెప్పకనే చెప్పాడు. దాంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హోటల్ రూమ్లో కూర్చోబెట్టడం దారుణం:
ఎస్ఆర్హెచ్ అభిమానులతో పాటు తాజాగా స్పోర్ట్స్ అనలిస్ట్ బొరియా మజుందార్ కూడా డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డాడు. 'ఇది చాలా కఠినమైన నిర్ణయం. డగౌట్లో ఉండేందుకు కూడా అతడికి అర్హత లేదా?. ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకెళ్లడం చాలా బాధించింది. టైటిల్ అందించిన ఆటగాడినే హోటల్ రూమ్లో కూర్చోబెట్టడం దారుణం. ఓ ఛాంపియన్ ప్లేయర్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటివ్వరా?. అతడికి అభిమానగణం భారీ స్థాయిలో ఉంది. అలాంటి వాడిని పక్కనబెడితే మీ బ్రాండ్ ఎలా పెరుగుతుంది. ఇకపై ఫాన్స్ తగ్గుతారు. దీనికి ఎవరు సమాధానం చెపుతారు' అని బొరియా మజుందార్ ఓ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












