హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి మెరిసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్లో మరోసారి బ్యాట్తో సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. మొహాలీతో పాటు ఉప్పల్లోనూ పంజాబ్ను సన్రైజర్స్ మట్టికరిపించింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
నాకౌట్ బెర్త్ దక్కాలంటే ఇదే వేదికపై జరిగే చివరి రెండు మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ నెగ్గాల్సి ఉంటుంది. కాగా, నిరుడు రన్నరప్ కింగ్స్ లెవన్ పంజాబ్ వరుసగా ఆరో ఓటమి చవి చూసింది. ఐదు పరుగులు తక్కువ కావడంతో పంజాబ్ ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్పై పరాజయం పాలైంది.
కెప్టెన్ వార్నర్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్తో 81) దూకుడు ప్రదర్శించడంతో సన్రైజర్స్ 5 పరుగుల తేడాతో పంజాబ్పై నెగ్గింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ తర్వాత హెన్రిక్స్ (3/16), బిపుల్ శర్మ (2/13) ధాటికి పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 89 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ మరోసారి తడబడింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ విజయ్ సిక్స్, రెండు బౌండరీలు బాది ఊపుమీద కనిపించాడు. తర్వాత అతను మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇంకో ఎండ్లో వోహ్రా కూడా భారీ షాట్లు ఆడాడు. అయితే విజయ్ (24)ని బిపుల్ శర్మ తొలి వికెట్గా వెనక్కి పంపాడు. తర్వాత వోహ్రా (20)ను కూడా బిపుల్ అవుట్ చేసి పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు.
మాక్స్వెల్ (11) జట్టును ఆదుకోలేకపోయాడు. పంజాబ్ 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత సాహా (5)తో పాటు కెప్టెన్ బెయిలీ (6) సింగిల్ డిజిట్కే వెనుదిరిగారు. పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైంది. చివర్లో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.
పంజాబ్ విజయానికి చివరి 18 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి ఓవర్లో 28 రన్స్ చేయాల్సి ఉండగా, తొలి రెండు బంతుల్ని మిల్లర్ స్టాండ్స్లోకి పంపి ఆశలు రేపాడు. అయితే ఇషాంత్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో చివరి నాలుగు బంతుల్లో 10 పరుగులే వచ్చాయి.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య సన్రైజర్స్కు శుభారంభం దక్కింది. కెప్టెన్ వార్నర్ ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. శిఖర్ ధావన్ రాణించలేకపోయాడు. అనురీత్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ 4, 6, 4తో జోరు ప్రదర్శించాడు. తర్వాతి ఓవర్లో ధావన్ రెండు బౌండరీలు బాదగా, వార్నర్ సిక్సర్ కొట్టాడు. అయితే పార్ట్టైమ్ స్పిన్నర్ మాక్స్వెల్ బౌలింగ్లో ధావన్ (24) బంతిని తప్పుగా అంచనా వేసి స్టంపౌటయ్యాడు. దీంతో తొలి వికెట్కు వార్నర్-ధవన్ 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ కూడా వేగంగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వార్నర్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెన్రిక్స్ (28) అవుటైన తర్వాత వార్నర్తో మోర్గాన్ జతకట్టాడు. వచ్చీరావడంతోనే మోర్గాన్ (17) రెండు సిక్సర్లు, ఫోర్తో దూకుడు ప్రదర్శించాడు. చివరలో వేగంగా ఆడే క్రమంలో వార్నర్ వెనుదిరిగాడు. తర్వాత లోకేశ్ రాహుల్తో సమన్వయం లోపంతో నమన్ ఓఝా (2) రనౌటయ్యాడు. చివర్లో లోకేశ్ (17 నాటౌట్), కర్ణ్శర్మ (11 నాటౌట్) జట్టు స్కోరును 185 పరుగులకు చేర్చారు.