ఐపీఎల్ మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. కోరుకున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికారు. ఐపీఎల్ చరిత్రలోనే రూ.20 కోట్లకు పైగా ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు.మిచెల్ స్టార్క్ ఆల్టైమ్ రికార్డు ధర పలికాడు. రూ24.75 కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.కమిన్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు వెచ్చించింది.
ఈ సారి వేలంలో సన్రైజర్స్ ఫ్రాంచైజీ ప్రదర్శన ఆకట్టుకుంది. స్టార్ ప్లేయర్లను దక్కించుకుంది. కమిన్స్ కోసం ప్రణాళికతోనే భారీ ధర వెచ్చించింది. ఆల్రౌండర్గానే కాకుండా కమిన్స్ కెప్టెన్గా రాణిస్తాడనే ఆలోచనతో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్ (రూ. 6.80 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.60 కోట్లు), హసరంగ (రూ. 1.50 కోట్లు), జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ.20 లక్షలు), ఆకాశ్ సింగ్ (రూ.20 లక్షలు)ను వేలంలో తీసుకుంది.

అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి చేరిన కమిన్స్, హెడ్కు కంగ్రాట్స్ చెబుదామనుకున్న డేవిడ్ వార్నర్కు షాక్ ఎదురైంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అతడిని సన్రైజర్స్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని అతడు తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దీంతో సన్రైజర్స్ ఫ్రాంచైజీపై విమర్శలు వస్తున్నాయి.
గతంలో వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2016లో జట్టును విజేతగా కూడా నిలిపాడు. అయితే యాజమాన్యంతో విభేదాల కారణంగా వార్నర్ జట్టుకు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి.కానీ వార్నర్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసేంత గొడవలు జరిగి ఉంటాయని ఎవరూ ఊహించలేదు.
వార్నర్ బ్లాక్ చేయడంపై నెట్టింట్లో ఎస్ఆర్హెచ్ జట్టు విమర్శలు ఎదుర్కొంటుంది. నిబ్బానిబ్బిలా ప్లేయర్లను బ్లాక్ చేయడమేంటని, సన్రైజర్స్ హైదరాబాద్ పేజీ అడ్మిన్ తెలివితోనే ఈ పనిచేశాడా అని కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టిన వార్నర్ను బ్లాక్ చేయడం చెత్త నిర్ణయమని అంటున్నారు. కాగా, నెట్టింట్లో వార్నర్కే సన్రైజర్స్ అభిమానులు మద్దతు ఇస్తున్నారు.