టీమిండియా హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పిన రాహుల్ ద్రవిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. యువ క్రికెటర్ల ఎంపిక, తుది జట్టు కూర్పు, జట్టును బలోపేతం చేయడంతో ద్రవిడ్కు అపారమైన అనుభవం ఉంది. సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమిండియాకు ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందే ద్రవిడ్ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని కొన్ని జట్లు భావిస్తున్నాయి. మెగా వేలం జరగనుండటంతో ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వదులుకోవాల్సి ఉంటుంది. తిరిగి వేలంలో జట్టును నిర్మించుకోవాలి. ఇది ఎంతో కీలకమైన ప్రక్రియ. మెగావేలం తర్వాత కొన్ని జట్లు బలంగా, మరికొన్ని బలహీనంగా మారే దశ.

దీంతో కోచ్గా లేదా మెంటార్గా ద్రవిడ్ను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తున్నాయి. కోచ్ వెటోరీ-కెప్టెన్ కమిన్స్ కాంబినేషన్లో ఎస్ఆర్హెచ్ 2024 సీజన్లో అదరగొట్టింది. రన్నరప్గా నిలిచింది. కానీ మెగావేలం తర్వాత హైదరాబాద్ జట్టు అదేరీతిలో బలంగా ఉండాలంటే గొప్పగా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ఆటగాళ్ల బలాబలాల గురించి, దేశంలోని స్టేడియాలపై అనుభవం ఉన్న ద్రవిడ్ వంటి వ్యక్తితో వ్యూహాలు రచిస్తూ ప్లేయర్లను ఎంపిక చేస్తే జట్టుకు తిరుగుండదు. అందుకే మెంటార్గా అయిన మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలోకి 'వాల్'ను ఆహ్వానించాలని ట్రై చేస్తుంది. మరోవైపు గౌతమ్ గంభీర్ కోచ్గా టీమిండియాకు వెళ్లడంతో కేకేఆర్ మెంటార్ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని ద్రవిడ్తో భర్తీచేయాలని భావిస్తోంది. ఇప్పటికే ద్రవిడ్తో కోల్కతా సంప్రదించింది కూడా.
ఇక టైటిల్ కల నెరవేర్చుకోవడం కోసం ద్రవిడ్ను తమ జట్టులోకి ఆహ్వానించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇప్పటికే దినేశ్ కార్తీక్ను మెంటార్గా నియమించింది. ప్రధాన కోచ్ ఆండి ఫ్లవర్ స్థానంలో ద్రవిడ్కు బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్తో అలసిపోయిన ద్రవిడ్ ఐపీఎల్లో కోచ్/మెంటార్గా ఆసక్తి చూపిస్తాడా? లేదా ఫ్యామిలీతో సమయాన్ని వెచ్చించాలని లీగ్కు దూరంగా ఉంటాడా? అనే విషయంపై స్పష్టత లేదు.