సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్కు షాక్ తగిలింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో సన్రైజర్స్ గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. కానీ డాసన్ సిక్సర్లతో హోరెత్తించడంతో మ్యాచ్ ఆఖరి బంతివరకు ఆసక్తికరంగా సాగింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 18.3 ఓవర్లలోనే 125 పరుగులకు ఆలౌటైంది. సన్రైజర్స్ బౌలర్ల ధాటికి ఆది నుంచే క్యాపిటల్స్ వికెట్లను చేజార్చుకుంది. పవర్ప్లేలోనే 52 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ సాల్ట్ (20; 9 బంతుల్లో) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే డాడ్స్వెల్ (24; 26 బంతుల్లో), నీషమ్ (27; 26 బంతుల్లో) నిలకడగా ఆడుతూ వికెట్ల పతానాన్ని అడ్డుకున్నారు. కానీ సన్రైజర్స్ బౌలర్లు పుంజుకోవడంతో ప్రిటోరియా చివరి అయిదు వికెట్లు 21 పరుగులకే కోల్పోయింది. మార్కో జేన్సన్ (3/27) డానియల్ వోరాల్ (2/29) సత్తాచాటారు.

అనంతరం ఛేదన్లో సన్రైజర్స్కు పేలవారంభం దక్కింది. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి సన్రైజర్స్ బ్యాటర్లు అతి జాగ్రత్తగా ఆడటంతో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. స్టబ్స్ (35; 30 బంతుల్లో), పాట్రిక్ (22; 21 బంతుల్లో) కాసేపు క్రీజులో నిలబడటంతో సన్రైజర్స్ గెలుపు బాటలోకి వెళ్తున్నట్లు కనిపించింది. కానీ వీరిద్దరు ఔటవ్వడంతో 17 ఓవర్లలో 90 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
విజయానికి సన్రైజర్స్ చివరి మూడు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి వచ్చింది. అనంతరం లియామ్ డాసన్ (29*; 16 బంతుల్లో) గొప్పగా పోరాడాడు. అతడి దూకుడుతో సన్రైజర్స్ శిబిరంలో ఆశలు మళ్లీ చిగురించాయి. 18వ ఓవర్లో 8 పరుగులే రాగా, 19 ఓవర్లో డాసన్ రెండు సిక్సర్లు సాధించడంతో ఆ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం ఆఖరి ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది.
కానీ డాసన్కు స్ట్రైక్రావడానికి మూడు బంతులు ఎదురుచూడాల్సి వచ్చింది. వోరాల్ (2; 4 బంతుల్లో) తొలి మూడు బంతుల్ని ఎదుర్కొని ఒక్క సింగిల్ తీశాడు. అనంతరం నాలుగో బంతికి డాసన్ సిక్సర్ సాధించాడు. కానీ చివరి రెండు బంతులకి పరుగులేమి చేయలేకపోవడంతో సన్రైజర్స్ మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.డాసన్కు ఆఖరి ఓవర్లో ముందే స్ట్రైకింగ్ దక్కివుంటే సన్రైజర్స్ గెలిచే అవకాశాలు ఉండేవి. ప్రిటోరియా బౌలర్లలో పార్నెల్, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు.